మరి కాసేపట్లో ఏపికీ మూడు ప్రత్యేక రైళ్లు..! ఓటర్లకు అదనపు రవాణా సౌకర్యం కల్పిస్తోన్న రైల్వే శాఖ..!!
అమరావతి/హైదరాబాద్ : ఏపీ లో మరి కొద్ది గంటల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభ కానుంది. ఇప్పటికే ఏపీ లో ఉన్న తమ ఓటు హక్కు వినియోగించుకోటానికి హైదరాబాద్ నుంచి ఏపీ లోని ప్రముఖ పట్టణాలకు రైల్వే, ఆర్టీసి ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నాయి.
రెగ్యులర్ సర్వీసులతో పాటు నడుపుతున్న స్పెషల్ సర్వీసులు కూడా క్రిక్కిరిసిన ప్రయాణికులతో నడుస్తున్నాయి. అంత రద్దీలో ప్రయాణించలేని ఓటర్లు కొందరు తమ ప్రయాణాలు మానుకున్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షణ మధ్య రైల్వే బుధవారం సాయంత్రం నుంచి మరో 3 ప్రత్యేక రైళ్ళు నడిపేందుకు సన్నాహాలు చేస్తోంది.
మొదటి రైలు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బుధవారం సాయంత్రం 6.20 నిమిషాలకు కాకినాడకు ఒక రైలు బయలుదేరుతుంది. ఈ రైలు ఖాజీపేట విజయవాడ మీదుగా కాకినాడ చేరుతుంది. రెండో రైలు ఏప్రిల్ 10వ తేదీ బుధవారం (ఇవాళే) రాత్రి 07.20కి సికింద్రాబాద్ నుంచి తిరుపతికి రైలు బయలుదేరుతుంది.
ఈ రైలు వరంగల్, ఖాజీపేట విజయవాడ మీదుగా తిరుపతి చేరుకుంటుంది. మూడో రైలు రాత్రి 08.50 గంటలకు లింగంపల్లి నుంచి కాకినాడకు బయలుదేరుతుంది. ఈ రైలు గుంటూరు భీమవరం టౌన్ మీదుగా కాకినాడ చేరుతుంది. ఈ 3 రైళ్ళలో అన్నీ జనరల్ బోగీలే ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. ఏపీలో ఓటుహక్కు ఉన్న ప్రతిఒక్కరూ ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని దక్షిణ మద్య రైల్వే అదికారులు సూచిస్తున్నారు.