మనవడు లోకేష్ ను టార్గెట్ చేస్తూ చంద్రబాబుకు ఉచిత సలహా ఇచ్చిన లక్ష్మీ పార్వతి
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు లక్ష్మి పార్వతి టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో తగిలిన దెబ్బ నుండి కోలుకోవటానికి ఉచిత సలహా ఇచ్చారు. గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న లక్ష్మీపార్వతి మీడియాతో మాట్లాడుతూ మనవడు లోకేష్ ను టార్గెట్ చేసి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మనవడు లోకేష్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన లక్ష్మీ పార్వతి .. లోకేష్ ను పక్కన పెడితే టీడీపీ బాగుపడుతుందని సలహా
తాజా రాజకీయాల నేపధ్యంలో జగన్ పాలనకు కితాబిచ్చిన లక్ష్మీ పార్వతి , ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ, మాజీ మంత్రి నారా లోకేష్పై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. లోకేష్ ఎంత ఎక్కువగా మాట్లాడితే అంత ఎక్కువగా పార్టీ భ్రష్టు పడుతుందని లక్ష్మీ పార్వతి వ్యాఖ్యానించారు . మహిళల్ని కించపరిచేలా లోకేష్ మాట్లాడుతున్నారని మనవడిపై విరుచుకు పడ్డారు. లోకేష్ వ్యాఖ్యల వల్ల టిడిపి గ్రాఫ్ బాగా తగ్గుతుందని పేర్కొన్నారు . మహిళలపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసే అలవాటు ఉన్నందున లోకేష్ తక్కువ మాట్లాడాలి అని లక్ష్మి పార్వతి సూచించారు . మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు . ఎంత త్వరగా లోకేష్ ను పక్కన పెడితే చంద్రబాబుకు , టీడీపీకి అంత మంచిది అని లక్ష్మీ పార్వతి పేర్కొన్నారు.
ఇల్లు బాగు చేస్తుంటే ఎలుకలు ఏడ్చినట్టు ప్రతిపక్షం తీరు ఉందన్న లక్ష్మీ పార్వతి
అంతేకాదు ఏపీ ప్రజా పరిపాలన సాగుతోందని.. జగన్ మంచి, మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నారని , ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారని ప్రశంసించారు లక్ష్మీ పార్వతి . ఓవైపు ఇల్లు బాగు చేస్తుంటే ఎలుకలు ఏడ్చినట్లుగా ప్రతిపక్షం వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు. ఏపి సిఎం వైయస్ జగన్ పాలనకు కితాబిస్తూ గత ప్రభుత్వ పరిపాలన లోని అవినీతి ప్రక్షాళన చేసేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు, టిడిపి నాయకులు ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నారని, ఎదురు దాడికి దిగుతున్నారని ఆమె పేర్కొన్నారు.
Recommended Video
లోకేష్ టార్గెట్ గా వ్యాఖ్యలు చేస్తున్న లక్ష్మీ పార్వతి .. బాబుకు ఉచిత సలహా
మొత్తానికి చంద్రబాబుకు లోకేష్ బాబు విషయంలో ఉచిత సలహా ఇచ్చి లక్ష్మీ పార్వతి షాక్ ఇచ్చారు . టీడీపీ రాబోయే రోజుల్లో బాగుపడలాంటే చంద్రబాబు ఆ పని చేస్తే సరిపోతుంది అని సలహా ఇచ్చిన వైసీపీ మహిళా నేత లక్ష్మీ పార్వతి ఇప్పటికే చాలా సార్లు మనవడిని టార్గెట్ చేశారు. ఎన్నికల సమయంలో కూడా లోకేష్ కు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించిన ఆమె మనవడా .. మందలగిరి కాదు మంగళగిరి అని స్పష్టంగా పలుకు అంటూ ఎద్దేవా చేశారు. ఇప్పుడు మరోమారు చంద్రబాబు రాజకీయ వారసుడిగా భావిస్తున్న లోకేష్ బాబుని పక్కన పెట్టాలని చెప్పి సంచలన వ్యాఖ్య చేశారు.