యువతిపై ఇంజినీరింగ్ విద్యార్థులు గ్యాంగ్రేప్: మతిస్థిమితం లేని మహిళపైనా..
విశాఖపట్నం: నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ 16ఏళ్ల యువతిపై ఇంజినీరింగ్ ఐదుగురు విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు అందింది. నగర శివారు తగరపువలసలో ఉంటున్న కొందరు ఇంజినీరింగ్ విద్యార్థులే అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
బాధ్యులు ఐదుగురని ప్రాథమికంగా నిర్ధారించినా, దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. తగరపువలసకు చెందిన బాధిత యువతి సెప్టెంబర్ 14న స్థానిక బాలాజీనగర్లోని బంధువుల ఇంటికి వెళ్లింది. ఆమె తిరిగి ఇంటికి చేరుకోకపోవడం, గాలించినా కనిపించకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
కుమార్తె కనిపించడం లేదంటూ వారు సెప్టెంబర్ 16న పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు ఇంటికి చేరుకున్న యువతి.. తనను కొందరు అపహరించి అత్యాచారం చేశారని తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు.
మతిస్థిమితం లేని మహిళపై సామూహిక అత్యాచారం
నెల్లూరు జిల్లా అనుమసముద్రంపేటలోని ఓ దర్గా వద్దకు హైదరాబాద్ నుంచి వచ్చిన ఓ మతిస్థిమితం లేని మహిళపై కొందరు అత్యాచారానికి పాల్పడ్డారు. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది.
గత కొంతకాలం క్రితం ఆమె బంధువులు దర్గా వద్దకు తీసుకొచ్చి వదిలివెళ్లారు. రెండు రోజుల క్రితం వర్షం కురవగా అదే సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ సమయంలో అక్కడ ఉన్న ఆ మహిళను ముగ్గురు యువకులు ఓ వరండా వద్దకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది.