స్నేహితురాలని నమ్మి వస్తే.. వ్యభిచార కూపంలో నెట్టింది
కృష్ణా: తన స్నేహితురాలే కదా.. అని నమ్మివస్తే మోసం చేసింది. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఓ యువతి తన స్నేహితురాలైన యువతిని వ్యభిచారం కూపంలోకి దింపింది. ఈ దారుణ ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమబెంగాల్ రాష్ట్రం నడియా జిల్లా శాంతిపూర్ పట్టణానికి చెందిన ఓ యువతి(16)కి ఆమె స్నేహితురాలు పింకూ పని ఇప్పిస్తానని నమ్మించి రైల్లో ఆగస్టు 14వ తేదీన విజయవాడకు తీసుకొచ్చింది.
ఆ తర్వాత రైల్వేస్టేషన్ వద్ద సురేష్ అనే వ్యక్తికి ఆ యువతిని అప్పగించి పింకూ వెళ్లిపోయింది. అతడు మరో మహిళతో కలిసి కానూరు మురళీనగర్లో నిర్వహిస్తున్న వ్యభిచార గృహానికి యువతిని తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై రెండు రోజులపాటు లైంగిక దాడి జరిపారు.
ఈ విషయాన్ని బాధిత యువతి పోలీసు కంట్రోల్ రూంకు ఫోన్ చేసి చెప్పగా, సురేష్ ఆమెను 16వ తేదీ రాత్రి కారులో విజయవాడ బస్టాండ్ వద్ద దించి వెళ్లిపోయాడు. అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆమెను పోలీసులు ప్రశ్నించగా జరిగిన సంగతి తెలిపింది.
కృష్ణలంక పోలీసులు బాధిత యువతిని పెనమలూరు పోలీసులకు అప్పగించగా వైద్య పరీక్షలు చేయించారు. సురేష్తోపాటు పలువురిపై కేసు నమోదు చేశారు. యువతి చెప్పిన చిరునామా ప్రకారం పోలీసులు కానూరు మురళీనగర్లోని ఆ ఇంటి వద్దకు వెళ్లగా అప్పటికే నిందితులు తాళంవేసి పరారయ్యారు.
ఓ ఇంజినీర్కు చెందిన ఆ ఇంటిని కొద్ది నెలల క్రితం అద్దెకు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. కొన్ని ఆధారాలు సేకరించిన పోలీసులు, నిందితుల కోసం గాలింపు చేపట్టారు.