షాక్: కౌన్సిలింగ్ పేరుతో ప్రేమజంటపై ప్రతాపం, బాలిక కుటుంబసభ్యుల ఆందోళన
కడప: కౌన్సిలింగ్ పేరుతో ప్రేమజంటపై పోలీసులు ప్రతాపం చూపారంటూ పోలీసుల తీరును నిరసిస్తూ బాలిక కుటుంబసభ్యులు ఆదివారం తెల్లవారుజామున పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.
కడప నగరంలోని ఆకులవీధికి చెందిన ఓ బాలికకు ,ఆశోక్ నగర్ కు చెందిన హార్షవర్ధన్ కు మద్య దాదాపు నాలుగేళ్ళుగా ప్రేమ వ్యవహారం సాగుతోంది. అయితే ఈ నేపథ్యంలోనే శనివారం ఉదయం నగరంలోని ఐటీఐ సర్కిల్ లోని ఆలయంలో వారిద్దరూ వివాహం చేసుకొన్నారు.
విషయం తెలుసుకొన్న అబ్బాయి కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ప్రేమజంటను పిలిపించారు. అయితే వీరిద్దరూ మైనర్లు కావడంతో వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తామని కుటుంబసభ్యులు చెప్పారు.
కానీ, ఆ పనిచేయకుండా సిఐ రామకృష్ణ బాలికను చితకబాదారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆ బాలిక కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. పోలీస్ దెబ్బలకు సొమ్మసిల్లిపడిపోయిన బాలికను ఆసుపత్రికి తీసుకెళ్ళాలని బంధువులు ఎంతగా ప్రాధేయపడినా స్పందించలేదని వారు ఆరోపించారు.
సిఐ రామకృష్ణ బాలికను ఆమె బంధువులను దుర్బాషలాడడంతో పాటు స్టేషన్ వద్ద ఉంటే మీపై కేసులు నమోదు చేస్తామని బెదిరిస్తూ దాడికి దిగబోయాడని బాధితులు వాపోయారు. బాలికను ఆసుపత్రికి తరలించేందుకు ఆమె బంధువులు 108 సమాచారం అందించడంతో అక్కడివాహనం చేరుకొంది.
పోలీసులు ఇక్కడ ఎవరూ గాయపడిన దాఖలాలు లేవని వాహనాన్ని తిప్పి పంపారు. బాలికను అబ్బాయిని పోలీసులు స్టేషన్ లో ఉంచారు. ఇద్దరూ మైనర్లు కావడంతోనే కౌన్సిలింగ్ కు పిలిపించామన్నారు. అయితే తాము ఎవరి పట్ల దురుసుగా ప్రవర్తించలేదని పోలీసులు చెప్పారు.