కోతులు వెంబడించడంతో భవనంపైనుంచి దూకిన బాలిక: బావిలో విద్యార్థి మృతదేహం
నెల్లూరు: జిల్లాలోని కోవూరు మండలం పెళ్లకూరు కాలనీలో కోతుల బెడదతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. కాగా, కోతుల బారి నుంచి తప్పించుకునేందుకు పల్లవి అనే 11 ఏళ్ల బాలిక బుధవారం ఉదయం రెండంతస్థుల భవనం పైనుంచి దూకేసింది.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలికను చికిత్స నిమిత్తం నెల్లూరు ఆస్పత్రికి తరలించారు. కోతులు ఇప్పటికే పలువురిపై దాడి చేశాయని, అధికారులు పట్టించుకోకపోవడం వల్లే కోతుల బెడద పెరిగిపోతోందని స్థానికులు ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
బావిలో ఇంటర్ విద్యార్థి మృతదేహం
విజయనగరం జిల్లా పార్వతీపురం పురపాలక సంఘం పరిధిలోని వైకేఎం కాలనీకి చెందిన ఇంటర్ విద్యార్థి సాయికిరణ్(16) మృతదేహం బుధవారం వ్యవసాయ బావిలో లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సాయికిరణ్ 3 రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితి కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది.
బుధవారం ఉదయం గ్రామ సమీపంలోని వ్యవసాయ బావిలో సాయికిరణ్ మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సాయికిరణ్ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని గ్రామస్తులు భావిస్తున్నారు.