రుణం కావాలంటే లొంగాల్సిందే: ఆ అధికారి కామపిశాచే!
ప్రభుత్వ పథకాలను సక్రమంగా అమలు చేయాల్సిన ఓ అధికారి తన అధికార దర్పంతో వందలాది మహిళలను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారు. చివరకు అతని వేధింపులు భరించలేక మహిళలందరూ కలిసి మీడియా ముందు
తిరుపతి: ప్రభుత్వ పథకాలను సక్రమంగా అమలు చేయాల్సిన ఓ అధికారి తన అధికార దర్పంతో వందలాది మహిళలను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారు. చివరకు అతని వేధింపులు భరించలేక మహిళలందరూ కలిసి మీడియా ముందు తమ గోడును వెళ్లబోసుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. తిరుపతిలో మెప్మా(స్వయంశక్తి మహిళా సంఘాల కో-ఆర్డినేటర్ ) అధికారి జయరామ్ కింద కొన్ని వందల మంది మహిళలు గ్రూపులుగా ఏర్పడి రుణాలు తీసుకుంటారు. వారందరి రుణాలకు సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షించడం ఇతన బాధ్యత.
అయితే తనకు అధికారం ఉందన్న దర్పమో.. లేక తన మాట ఎందుకు కాదంటారేమోనన్న నమ్మకమో గానీ.. మహిళలను తన లైంగిక వాంఛ తీర్చాలంటూ వేధింపులకు గురిచేసేవాడు. ఏకంగా తనకు లొంగిపోవాలంటూ ఐదు మంది స్వయంశక్తి సంఘాల గ్రూపు లీడర్లను వేధించడం మొదలుపెట్టాడు. వారి గ్రూపుల్లో ఉన్న మహిళలు తీసుకున్న రుణాల చెల్లింపులను పర్యవేక్షించే బాధ్యతల్లో ఉన్న మహిళలు జయరాం తీరును తీవ్రంగా ఆక్షేపించారు.
ఇది సరైన పద్ధతి కాదంటూ అనేకసార్లు మందలించారు కూడా. అయినా, తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ జయరామ్ వారిని ఎదుర్కొన్నాడు. అంతేగాక, తాను సంతకం పెట్టకపోతే మీకు రుణాలే రావంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో ఇంతమంది మహిళలు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆ గ్రూపు లీడర్లకు ఏం చేయాలో అర్థం కాలేదు. అతని వేధింపులు మితిమీరడంతో వేరే దారిలేక మీడియాను ఆశ్రయించారు.
జయరామ్ వ్యవహారంపై ఉన్నతాధికారులతోపాటు మంత్రి అమరనాథ్ రెడ్డికి కూడా ఫిర్యాదు చేసినట్లు మహిళా గ్రూపు సభ్యులు తెలిపారు. అయినా అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. కాగా, తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ అల్లుడు సజంయ్ అండదండలు చూసుకునే జయరామ్కు ఇలా రెచ్చిపోతున్నట్లు తెలిసింది.
అయితే, మహిళా గ్రూపు సభ్యులు తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ జయరామ్ తెలిపాడు. అంతేగాక, మహిళలంటే తనకు అమితమైన గౌరవమని చెప్పుకొచ్చాడు. కాగా, జయరామ్ తీరుపై మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. వెంటనే అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.