చంద్రబాబుకు హోం గార్డుల ఉసురు తగులుతుంది .. విజయసాయిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు
ట్విట్టర్ వేదికగా ఏపీ సీఎం చంద్రబాబుపై విరుచుకుపడే విజయసాయిరెడ్డి చంద్రబాబు ను వదిలేలా లేరు. వదల బొమ్మాలీ వదల అంటూ రోజూ చంద్రబాబుపై ట్వీట్ల దాడికి దిగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
రోజుకో అంశంతో చంద్రబాబును ఇరకాటంలో పెట్టాలని చూస్తున్న విజయసాయి రెడ్డి ఇప్పుడు హోం గార్డుల అంశంపై మండిపడ్డారు. ఇటీవల ఏపీలో ఎన్నికలు జరిగిన సమయంలో డ్యూటీలు నిర్వహించిన హోం గార్డులకు చెల్లించాల్సిన డీఏ కంటే తక్కువ చెల్లించి ప్రభుత్వం చేతులు దులుపుకుందని వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఆరోపించారు. చంద్రబాబుకు హోం గార్డుల ఉసురు తగులుతుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేసిన విజయ సాయి రెడ్డి ఎన్నికల సమయంలో 65 రోజులు ఎర్రని ఎండలో 12 వేల మంది హోం గార్డులు డ్యూటీ చేశారని, వారికి తొమ్మిది వేల రూపాయల చొప్పున డీఏ చెల్లించాలి కానీ, రూ.4,500 చొప్పున ఇచ్చి చేతులు దులుపుకుంటారా అని ప్రశ్నించారు.
నంద్యాల..కర్నూలు సీట్లు మనవే : చంద్రబాబు ధీమా: టీడీపీ నేతలు..వైసీపీ మాత్రం ఇలా..!
అంతే కాదు ఎంపీ రాయపాటి సంస్థలకు అక్రమంగా రూ.400 కోట్లు చెల్లించేందుకే కేబినెట్ భేటీ అంటూ చంద్రబాబు హడావిడి చేస్తున్నారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు గురించి కూడా విజయసాయి ప్రస్తావించారు. పూర్తి కాని ఈ ప్రాజెక్టు సందర్శనకు రూ.400 కోట్లు ఖర్చు చేసి ఖజానా ఖాళీ చేశారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు చెల్లింపులన్నింటినీ వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, పోలవరం ప్రాజెక్టు పనులపై ఆడిటింగ్ జరిపిన తర్వాతే చెల్లింపులు జరపాలని విజయసాయిరెడ్డి అన్నారు.