అలిపిరి వద్ద తుపాకీ కలకలం: గన్తోపాటు 2రౌండ్ల బుల్లెట్లు సీజ్
తిరుపతి: తిరుమల వెళ్లే మార్గంలో అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద లైసెన్స్ లేని తుపాకీ కలకలం సృష్టించింది. ఆ తుపాకీని ఓ కారు నుంచి విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఉదయం తిరుమలకు వెళ్లే భక్తులను అలిపిరి తనిఖీ కేంద్రంలో భద్రతా సిబ్బంది పరిశీలించడంతో తుపాకీ బయటపడింది.
ఒడిశాలోని భువనేశ్వర్కు చెందిన రమణ్ పాణి.. అతని కుటుంబసభ్యులతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి కారులో వస్తుండగా.. అలిపిరి వద్ద భద్రతా సిబ్బంది తనిఖీలు చేశారు. కారు డ్రైవర్ సీటు వద్ద రహస్య ప్రాంతంలో తుపాకీని భద్రతా సిబ్బంది గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
తుపాకీతోపాటు రెండు రౌండ్ల బుల్లెట్లు గుర్తించారు. దీనిపై ప్రాథమికంగా విచారించిన టీటీడీ నిఘా, భద్రతా అధికారులు కేసు నమోదు చేసి తిరుమల రెండవ పట్టణ పోలీసులకు అప్పగించారు.
సీవీఎస్ఓ రవికృష్ణ మాట్లాడుతూ.. నిందితుడు రమణ్ పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్నట్లు తెలిపారు. కాగా, తనకు వివాదాలు ఉన్నట్లు చెప్పిన రమణ్.. సేఫ్టీ కోసమే తుపాకీ కొన్నట్లు తెలిపాడు.