మద్యం మత్తులో హెడ్కానిస్టేబుల్ దాష్టీకం: మహిళపై చెప్పుతో దాడి
గుంటూరు: నగరపాలెం పోలీస్ స్టేషన్లో హెడ్కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు మహిళలపై దాడులకు పాల్పడుతూ వీరంగం సృష్టించాడు. అందరూ చూస్తుండగానే చెప్పుతో కొట్టాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకున్నట్లు తెలిసింది.
గుంటూరు నగరంలోని కొండా వెంకటప్పయ్యకాలనీకి చెందిన కొందరు మహిళలను హెడ్కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు విచారణ పేరిట పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. ఆదివారం రాత్రి సమయంలో మద్యం మత్తులో ఉన్న వెంకటేశ్వరరావు మహిళల వద్దకు వచ్చి దాష్టీకానికి పాల్పడ్డాడు.
ఓ మహిళను చెప్పుతో కొట్టి తీవ్రంగా అవమానించాడు. ఈ దృశ్యాలను అక్కడున్న కొందరు ఫొటోలు తీయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దాడి ఘటన ఉన్నతాధికారుల వరకు వెళ్లడంతో వారు విచారణకు ఆదేశించారు.
కాగా, పోలీస్స్టేషన్లో ఎవరి అనుమతి లేకుండానే హెడ్ కానిస్టేబుల్ మహిళలను స్టేషన్కు తీసుకొచ్చినట్లు తెలిసింది. ఘటన జరిగిన సమయంలో కానిస్టేబుల్ మద్యం మత్తులో ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. విచారణ పూర్తయిన అనంతరం సదరు హెడ్ కానిస్టేబుల్పై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు వెల్లడించారు.