అదనపు కట్నం తేకుంటే చంపేస్తానంటోంది: భార్యపై భర్త ‘గృహహింస’ ఫిర్యాదు!
బెంగళూరు: ఇప్పటి వరకు మనం భార్యలను అదనపు కట్నం కోసం వేధింపులకు పాల్పడే భర్తలను మాత్రమే చూశాం.. కానీ, ఇక్కడ మాత్రం రివర్స్ జరుగుతోంది. అదనపు కట్నం తేవాలంటూ తన భార్య తనను వేధింపులకు గురిచేస్తోందంటూ ఓ భర్త పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి అదనపు కట్నం కోసం తన భార్య వేధింపులకు గురిచేస్తోందని మహదేవపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్య నెక్లెస్ కోసం రూ. 30లక్షలు, ఆమె చెల్లెలి పెళ్లి కోసం రూ.40లక్షలు ఇవ్వాలంటూ వేధిస్తోందని పోలీసుల ముందు వాపోయాడు.
అంతేగాక, డబ్బులు ఇవ్వకుంటే చంపేస్తానంటూ బెదరిస్తోందని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, భార్య బాధితులు కూడా గృహహింస నిరోధక చట్టం ద్వారా కేసు దాఖలు చేయవచ్చని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.