టీడీపీ నేత హత్య కేసులో కీలక ట్విస్ట్..! పీఎస్లో లొంగిపోయిన వైసీపీ నేత..!!
గుంటూరు/హైదరాబాద్ : మంగళగిరి పట్టణంలో జరిగిన మర్ఢర్ మిస్టరీ ఓ కొలిక్కి వస్తున్నట్టు తెలుస్తోంది. టీడీపీ నేత ఉమా యాదవ్ దారుణ హత్య కేసులో పోలీసుల ఎదుట ఐదుగురు నిందితులు లొంగిపోయారు. వైసీపీ నేత తోట శ్రీనివాసరావు యాదవ్ పాటు అతని అనుచరులు లొంగిపోయారు. గత రాత్రి మంగళగిరి పట్టణంలో దారుణ హత్యకు గురైన టిడీపీ నేత ఉమా యాదవ్ హత్యపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
ఆధిపత్య పోరే హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. వివరాల్లోకి వెలితే...జనం సంచరిస్తుండగానే... నాలుగు రోడ్ల కూడలి జంక్షన్లోనే ఓ టీడీపీ నేత దారుణ హత్యకు గురి కావడం గుంటూరు జిల్లా మంగళగిరిలో కలవరం రేపింది. ఈ హత్యకు బాధ్యుడంటూ ఓ వైసీపీ నాయకుడి ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడికి ప్రయత్నించడంతో కొన్ని గంటలపాటు వాతావరణం ఉద్రిక్తంగా మారింది.పోలీసుల కథనం ప్రకారం.. మృతుడు మంగళగిరి ఇందిరానగర్కు చెందిన నలబై ఏళ్ల తాడిబోయిన ఉమాయాదవ్, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు.
స్థానిక గౌతమబుద్ధ రోడ్డు సమీపంలో తన కార్యాలయ నిర్మాణ పనులను ముగించుకుని మంగళవారం రాత్రి 8:20 సమయంలో ద్వారకానగర్లోని తన ఇంటికి బయల్దేరారు. ఆయన అనుచరుడు శ్రీకాంత్ ద్విచక్రవాహనం నడుపుతుండగా... ఉమాయాదవ్ వెనుక కూర్చొన్నారు. ఇంటికి కూతవేటు దూరంలో నాలుగు రోడ్ల కూడలి వద్ద ఇద్దరు వ్యక్తులు అడ్డుతగలడంతో బండి స్లో చేశారు. వెనుక నుంచి మరో ఇద్దరు ఆగంతకులు మారణాయుధాలతో ఉమాయాదవ్ తలపై మోదారు.
కింద పడిపోయిన అతడిపై ప్రత్యర్థులు విచక్షణారహితంగా దాడి చేశారు. ఉమాయాదవ్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ హత్యకు కారణాలు పూర్తిగా తెలియరాలేదు. పాతకక్షలు, రాజకీయ కోణం, రియల్ ఎస్టేట్ లావాదేవీలు, ఆధిపత్య పోరు వంటి అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఎన్నికల ముందు తన అనుచర వర్గంతో కలిసి ఉమాయాదవ్ టీడీపీలో చేరారు. ఆయన గతంలో బేతపూడి సర్పంచ్ బత్తుల నాగసాయి హత్య కేసులో ప్రధాన నిందితుడు.