వివాహేతర సంబంధం: తెలిసిందని చిన్నారి హత్య
అనంతపురం: అక్రమ సంబంధానికి ఓ చిన్నారి బలైంది. ఈ ఘటన అనంతపురం జిల్లాలోని కదిరిలో చోటుచేసుకుంది. కదిరికి చెందిన లిఖిత (6) అనే చిన్నారి మొదట అదృశ్యమైందని పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు దర్యాప్తు జరిపారు. దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. అక్రమ సంబంధం కారణాంగానే చిన్నారిని ఆమె తల్లి ప్రియుడు హత్య చేశాడని పోలీసులు తేల్చారు.
కదిరి పట్టణంలోని అడపాలవీధికి చెందిన ఉమామహేశ్వరి అనే మహిళకు ఇద్దరు కూతుళ్లు. మృతురాలు లిఖిత ఆమె చిన్న కూతురు. ఏడాది క్రితం ఉమామహేశ్వరి భర్త అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో ఆమె కుట్టుపని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. కాగా, ఇంటికి సమీపంలోని స్విమ్మింగ్ ఫూల్కు తన కుమార్తెను ప్రతీ రోజు ఈత నేర్పించడానికని వదిలి వెళ్లేది. ఈ క్రమంలో ఆమెకు స్విమ్మింగ్ ఫూల్ యజమాని ఇలియాజ్తో సాన్నిహిత్యం ఏర్పడింది.
చివరకు అది అక్రమ సంబంధానికి దారితీసింది. కొన్ని రోజుల క్రితం ఈ విషయం లిఖితకు తెలిసింది. దీంతో ఈ విషయం బయటకు పొక్కితే తాను అవమానం పాలవుతానని భావించిన ఇలియాజ్.. ఎలాగైనా లిఖితను అడ్డుతొలగించాలనుకున్నాడు. మే 21న ఉమామహేశ్వరి తన కుమార్తెను ఎప్పటిలాగే స్విమ్మింగ్ ఫూల్లో వదిలి వచ్చింది. అయితే సాయంత్రమైన లిఖిత ఇంటికి రాకపోవడంతో ఉమామహేశ్వరి ఆందోళనతో అక్కడికి వెళ్లి విచారించింది.
ఇలియాజ్ లిఖిత ఎప్పుడో వెళ్లిపోయిందని ఆమెకు చెప్పాడు. మే 22న లిఖిత కనిపించడం లేదని కదిరి పోలీసులకు ఉమామహేశ్వరి ఫిర్యాదు చేసింది. దీంతో ఆమె కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. అనుమానం వచ్చి ఇలియాజ్ను స్టేషన్కు తీసుకువచ్చి తమదైన శైలిలో పోలీసులు విచారించారు. దీంతో అతడు అసలు నిజం చెప్పాడు.
మే 21న సిమ్మింగ్ ఫూల్కు వచ్చిన లిఖితను నీటిలో ముంచి హత్య చేసినట్లు చెప్పాడు. ఆ తర్వాత అదే రోజు రాత్రి లిఖిత మృతదేహాన్ని ముదిగుబ్బ మండలం దొరిగల్లు-పులివెందుల రోడ్డు పక్కన ఉన్న అడవిలో పూడ్చిపెట్టినట్లు నిందితుడు అంగీకరించాడు. లిఖిత మృతదేహాన్ని బయటికి తీసి కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు, నిందితుడ్ని అరెస్ట్ చేశారు. అతనికి సహకరించిన మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.
భార్యా పిల్లలపై దాడి: ఆత్మహత్య
హైదరాబాద్: నగరంలోని బాలానగర్ పోలీస్స్టేషన్ గౌతంనగర్లో దారుణం జరిగింది. భార్యాపిల్లలపై రాములు అనే వ్యక్తి రాడ్తో దాడి చేశాడు. ఆ తర్వాత భవనంపై నుంచి దూకి రాములు ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య, పెద్ద కూతురు పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ఆస్పత్రికి తరలించారు.
ఇది ఇలా ఉండగా కరీంనగర్ జిల్లాలోని సుభాష్నగర్లో అప్పుడే పుట్టిన ఆడ శిశువును కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రోడ్డుపై వదిలి వెళ్లారు. దీన్ని గుర్తించిన స్థానికులు శిశువును ఆస్పత్రికి తరలించారు.