ఆస్తి కోసం ‘టెక్కీ’ కొడుకును దారుణంగా హత్య చేశాడు
శ్రీకాకుళం: జిల్లాలోని రాజాంటౌన్ నవ్యనగర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆస్తి కోసం కన్న కొడుకునే హత్య చేశాడు ఓ తండ్రి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళితే.. ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించిన సీతారాం గత కొంత క్రితం రిటైరయ్యాడు. అతని కుమారుడు శ్రీకాంత్ హైదరాబాద్లో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. వీరిది ఎగువ మధ్య తరగతి కుటుంబమే. స్థిర, చరాస్తులు బాగానే ఉన్నాయి.
కాగా, సీతారాం తన కూతురు పెళ్లి కోసం తన పొలాన్ని అమ్మాలని నిర్ణయించాడు. ఆ పొలాన్ని తన సోదరికి అమ్మాలని అనుకుంటున్నట్లు శ్రీకాంత్కు సీతారాం చెప్పాడు. అయితే, బయటికి వారికి అమ్మితే మరింత ఎక్కువగా డబ్బు వస్తుందని, ఆమెకు పొలాన్ని అమ్మవద్దని శ్రీకాంత్ తండ్రికి స్పష్టం చేశాడు.
ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కాగా, ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో శ్రీకాంత్ను వేట కొడవలితో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు సీతారాం. దీంతో శ్రీకాంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు సీతారాంను అరెస్ట్ చేశారు. కన్న కొడుకునే ఇలా చంపడం స్థానికంగా కలకలం రేపింది.