మోసగాళ్ళు ఏపీ సీఎం జగన్ సతీమణి భారతి పేరును వదలట్లేదుగా... భారతి పీఏ అని చెప్పి ...
మోసపోయే వాళ్ళు ఉన్నంత కాలం మోసం చేసే వాళ్ళు ఉంటారు. అయితే ఇటీవల కాలంలో సమాజంలోని ప్రముఖుల పేర్లు చెప్పి మోసం చేసే వాళ్ళ జాబితా బాగా పెరిగిపోయింది. వైట్ కాలర్ మోసాలు ఇబ్బడిముబ్బడిగా వెలుగుచూస్తున్నాయి. మొన్నటికి మొన్న మంత్రి తానేటి వనిత సంతకాన్ని ఫోర్జరీ చేసి, ఆమె లెటర్ హెడ్ ని సృష్టించి అసైన్డ్ భూమిని సంపాదించాలని ఓ ప్రబుద్ధుడు ప్రయత్నం చేయగా ఇక తాజాగా ఏకంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీ పిఏ అని చెప్పి మోసాలకు పాల్పడుతున్న ఓ కేటుగాడి గుట్టు రట్టయింది.
ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తా .. భారతి పీఏ అంటూ మోసం
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైయస్ భారతి పీ ఏ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఒక వ్యక్తి పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక వివరాల్లోకి వెళితే వైయస్ భారతి పిఏ అంటూ ఓ వ్యక్తి జనాలను మోసం చేస్తున్నాడు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ, డబ్బులు ఇస్తే ఉద్యోగాలు ఇప్పించడం తనకు చిటికెలో పని అని నిరుద్యోగులను నమ్మబలికి వారి వద్ద నుండి డబ్బులు వసూలు చేస్తున్నాడు.
2వేల కోట్ల నల్లధనం.. చంద్రబాబు మాజీ పీఏతో పాటు పార్టీ నేతల ఇళ్ళల్లో సోదాలలో విస్తుపోయే అంశాలు !!
విజయవాడకు చెందిన ఘరానా వైట్ కాలర్ మోసగాడు
విజయవాడ సమీపంలోని గొల్లపూడి కి చెందిన సత్య శ్రీ రామ్ అనే వ్యక్తి గతంలో బ్యాంకులో పని చేశాడు. డిప్యూటీ మేనేజర్ గా పనిచేసి మానేసిన అతను ఈజీగా డబ్బు సంపాదించే మార్గాన్ని ఎంచుకున్నాడు. అందుకోసం ఏకంగా సీఎం జగన్ సతీమణి వైయస్ భారతి పీఏ అని చెప్పి మోసాలకు తెగబడ్డాడు. గతంలో జగదీష్ అనే వ్యక్తికి తిరుమలలో గదులు ఇప్పించటం లో సహాయం చేశాడు సత్య శ్రీ రామ్. అదే పరిచయంతో ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే డబ్బులు ఇస్తే ఉద్యోగం ఇప్పిస్తానని జగదీష్ ను నమ్మించాడు.
పంచాయితీ రాజ్ లో ఉద్యోగం పేరుతో లక్షపైగా వసూలు
జగదీష్ ద్వారా అఖిల్ అనే యువకుడికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నమ్మించాడు. పంచాయితీ రాజ్ లో జాబ్ పక్కా అని చెప్పాడు. ఇక అతని వద్దనుండి లక్ష రూపాయలకు పైగా వసూలు చేశాడు. అతని సర్టిఫికెట్లు కూడా పంపించమని చెప్పి ఉద్యోగం తప్పక వస్తుందని బురిడీ కొట్టించాడు. అయితే కొద్ది రోజులకు అతను వైయస్ భారతి పీఏ కాదని తెలిసి తాను మోసపోయినట్టు గుర్తించారు అఖిల్. ఇక ఇతనిలానే మరో ముగ్గురు బాధితులు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది.
మోసపోయానని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు .. కేసు నమోదు
అఖిల్ సత్య శ్రీరామ్ పై భవానిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి కేటుగాళ్ళను నమ్మి మోసపోవద్దని పోలీసులు ఎంతగా చెప్పినా చాలామంది ఇంకా మోసపోతూనే ఉన్నారు. నిరుద్యోగ యువత బలహీనతను ఆసరాగా చేసుకొని ఇలాంటి వాళ్ళు నమ్మించి మోసం చేస్తున్నారు. చాలా ధైర్యంగా పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు చెప్పి మోసాలకు పాల్పడుతున్న తీరు అటు పోలీసులను, ఇటు సమాజంలోని ప్రతి ఒక్కరిని విస్మయానికి గురిచేస్తుంది. ఇలాంటి వైట్ కాలర్ మోసగాళ్ళ పట్ల తస్మాత్ జాగ్రత్త .