స్వయంకృషి సుబ్బారావు:కాకా హోటల్ కార్మికుడి నుంచి పారిశ్రామిక వేత్తగా ఎదిగారు
ఒంగోలు:కింది స్థాయి నుంచి స్వయంకృషితో ఉన్నత స్థాయికి ఎదిగిన వారిని అందరూ గౌరవించడం కద్దే!..అయితే అలా ఎదిగి రావడం అనేది ఎంత కష్టమో...దాని వెనుక ఎన్ని కష్టాలు...కన్నీళ్లు దాగుంటాయో...ఎన్న నిద్రలేని రాత్రులను వారు గడిపివుంటారో అది వాళ్లనే అడిగితే తెలుస్తుంది.
అలా కష్టపడి అట్టడుగు స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగిన ఒక పారిశ్రామికవేత్త గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆయన అసలు పేరు దొడ్డక సుబ్బారావు...కష్టపడి స్వయంకృషితో పైకొచ్చాడు కాబట్టి...స్వయంకృషి సినిమాలో చిరంజీవి కూడా అలాగే ఎదిగిడు కాబట్టి...ఇతడిని కూడా అందరూ స్వయంకృషి సుబ్బారావు అని పిలుస్తారు. వివరాల్లోకి వెళితే...
సుబ్బారావు...ఫ్లాష్ బ్యాక్...
దొడ్డక వెంకట సుబ్బారావు గుంటూరు జిల్లా కాకుమాను మండలం వల్లూరు గ్రామంలో 1972 సంవత్సరంలో ఒక సామాన్య రైతు కూలీ కుటుంబంలో జన్మించారు. 1987లో పదో తరగతి పాసైనప్పటికీ కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువు అంతటితో మానేయాల్సి వచ్చింది. ఇంటి పోషణ కోసం తండ్రి ఒక్కడే కష్టపడుతుండటం చూసిన సుబ్బారావు సొంతూరులోనే కాకా హోటల్లో పనికి కుదిరాడు. ఆ తర్వాత కొంతకాలానికి తానే సొంతంగా కాకా హోటల్ ప్రారంభించాడు. కొన్నాళ్లు బాగానే సాగినా కుటుంబ బాధ్యతలు పెరగడం, ఆదాయం సరిపోకపోవడంతో ఆ హోటల్ను వేరే వాళ్లకు ఇచ్చేశాడు.
ఒంగోలుకు...చేరిక
అలా మళ్లీ పొట్ట చేత్తో పట్టుకొని ఉపాధిని వెతుక్కుంటూ 2002లో ఒంగోలు పట్టణానికి చేరుకున్నారు. ఒక స్నేహితుడి సాయంతో ఇక్కడి కర్నూలు రోడ్డులోని వీఐపీ బ్యాగుల దుకాణంలో గుమాస్తాగా చేరాడు. కొంతకాలానికి ఆ వ్యాపారంలో మెళకువలు నేర్చుకుని తాను పనిచేస్తున్న దుకాణాన్నే లీజుకు తీసుకున్నాడు. అలా వీఐపీ బ్యాగుల షాపును సమర్థవంతంగా నిర్వహిస్తూనే నలుగురికి ఉపాధి కల్పించే స్థాయికి వచ్చారు. అయితే తమ దుకాణానికి స్కూల్ బ్యాగులు కొనేందుకు ఎక్కువగా వచ్చే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇనుప మంచాలు, స్టడీ చైర్లు, చెప్పుల స్టాండ్లు అడగడం ప్రారంభించారు. దీంతో సుబ్బారావు ఆలోచనలో పడ్డాడు.
ఇంజనీరింగ్ వర్క్స్...దినదినాభివృద్ది
అలోచించిందే తడవుగా వాటి తయారీ వైపు దృష్టి పెట్టి ఆ పరిశ్రమ స్థాపనకు అవసరమైన వనరులను కష్టపడి సమకూర్చుకున్నాడు. అలా 2009లో ఒంగోలు దక్షిణ బైపాస్లో ఖాళీ స్థలాన్ని లీజుకు తీసుకుని షెడ్లు నిర్మించి ఇంజినీరింగ్ వర్క్స్ పరిశ్రమను స్థాపించారు. అలా తొలుత ఐదుగురు కార్మికులతో పరిశ్రమ మొదలు పెట్టగా అది దినిదినాభివృద్ధి చెంది ఇప్పుడు 110 మందికి పైగా కార్మికులు పని చేసే స్థాయికి ఎదిగింది. తన దగ్గర ఉపాధికి కొరత లేదని...స్కిల్డ్ వర్కర్స్, రోజువారీ కార్మికులతోపాటు ఇంకా ఎవరైనా పనికోసం వస్తే కాదనేదే ఉండదని సుబ్బారావు చెబుతున్నారు.
మెషినరీ...అప్ డేట్
గతంలో ఎక్కువగా మాన్యువల్ గా పనులు చేయించగా కాలక్రమంలో అధునాతన యంత్ర పరికరాలు సమకూర్చుకున్నారు. ఎలక్ట్రో స్ట్రాటిక్ మిషన్లు, పౌడర్ కోటింగ్ ఎక్విప్మెంట్, హీటింగ్ మిషన్లు, వెల్డింగ్, కటింగ్ మిషన్లతోపాటు వివిధ రకాల యంత్ర పరికరాల సాయంతో పనులు చేయిస్తున్నారు. ఇక్కడ హాస్పిటళ్లు,స్కూళ్లు, కాలేజ్ లు, హాస్టళ్ళు,హోటళ్లకు అవసరమైన ఇనుప మంచాలు, నవారు మంచాలు, లాడ్జిలకు ఉపయోగపడే మంచాలు, పడక కుర్చీలు, స్టడీ చైర్లు, ఆఫీస్ టేబుల్స్, చెప్పుల స్టాండ్లు ఇలా ఒకటేమిటి ఇంజినీరింగ్ వర్క్స్కు సంబంధించి టోకుగా ఎలాంటి ఆర్డర్ ఇచ్చినా సకాలంలో పూర్తి చేసి ఇవ్వడమే సుబ్బారావు ప్రత్యేకత.
మరో కీలకమైన...ముందడుగు...
ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రకటించిన ఈ-టెండర్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వైద్యశాలకు ఐరన్ షీట్తో కూడిన ఇనుప మంచాలను సరఫరా చేసే అవకాశం సుబ్బారావు దక్కించుకున్నారు. ఏటా వేలాది మంచాలు తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆస్పత్రులకు సరఫరా చేస్తున్నారు. ఇక్కడ తయారు చేసే సామగ్రిని తీసుకెళ్లి, నగదును నెలవారీ వాయిదాల రూపంలో చెల్లిస్తూ 50 మంది వరకు ఉపాధి పొందుతున్నారు.
పది మందికీ ఉపాధి...అదే నాకు ఆనందం
మనం ఒక్కరమే బ్రతకడం కాదు...పది మందిని బ్రతికించాలనేదే నా లక్ష్యం. మా నాన్న పొలం పనికి వెళ్తూ మరో పది మందిని ముఠా కట్టి తీసుకెళ్లేవారు. పది మంది ఒక పొలంలో పనికెళ్తే వాళ్లందరికీ ఉపాధి దొరికినట్లే. నేను స్థాపించిన పరిశ్రమలో కూడా అలాగే ఉపాధి కల్పించాలని భావించా. పొట్టపోసుకోవడానికి సరైన పరి దొరకడం ఎంత కష్టమో నాకు తెలుసు...2002లో ఒంగోలు వచ్చి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి చేరుకున్నా...ఇందుకోసం దాదాపు 10 సంవత్సరాలు తీవ్రంగా కష్టపడ్డా...ఇప్పుడు వందమందికి పైగా కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నానన్న సంతృప్తి నాకెంతో సంతోషాన్నిస్తోందని చెబుతున్నారు స్వయంకృషి సుబ్బారావు అలియాస్ దొడ్డక వెంకట సుబ్బారావు.