విషాదం: మెడికల్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య, పిరికివాడు కాదంటూ తండ్రి
Recommended Video
కర్నూలు: నగరంలోని మెడికల్ కాలేజీ హాస్టల్లో విషాద ఘటన చోటు చేసుకుంది. తన గదిలో ఇతర విద్యార్థులు లేని సమయంలో ప్రణీత్ హర్ష కొమ్మ అనే ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ప్రణీత్ హర్ష.. కడప జిల్లా అరవింద్ నగర్ వాసి. కాగా, ప్రణీత్ మృతిపై ఆయన తండ్రి రామాంజులు రెడ్డి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాలేజీలో ర్యాగింగ్ చేస్తున్నారంటూ ప్రణీత్ తనకు పలుమార్లు చెప్పాడని ఆయన తెలిపారు.
అయితే, కాలేజీలో ర్యాగింగ్ మామూలేనని, బాగా చదువుకోమని చెప్పానని తాను సూచించినట్లు తెలిపారు. తన కొడుకు ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాడు కాదని చెప్పారు. తన కుమారుడిని కొట్టి చంపారని ప్రణీత్ తండ్రి రామాంజులు రెడ్డి ఆరోపించారు.
కాలేజీ వైస్ ప్రిన్సిపాల్తో ఘటనపై ఆయన వాగ్వాదానికి దిగారు. కనీసం తనకు ఘటనపై సమాచారం ఇవ్వలేదంటూ యాజమాన్యంపై మండిపడ్డారు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.