నాన్నా..నన్ను క్షమించు..కర్నూలులో మెడికో ఆత్మహత్య..సూసైడ్ నోట్
కర్నూలు: తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థినీ,విద్యార్థుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. దీంతో తమ పిల్లలు ఉన్నత శిఖరాలు అధిరోహించాలనే తల్లిదండ్రుల ఆశలు అడియాసలవుతున్నాయి. కారణాలేమైనప్పటికి విద్యార్థులు క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు వారి జీవితాలను అంతం చేసెయ్యడంతో పాటు కన్నవాళ్ల కు కడుపుకోతను మిగులుస్తున్నాయి...తాజాగా.. కర్నూలులో ఓ మెడికో ఆత్మహత్య చేసుకున్నఘటన కలకలం సృష్టించింది.
వివరాల్లోకి వెళితే...కర్నూలు మెడికల్ కాలేజీలో ఆర్థోపెడిక్ విభాగంలో పీజీ రెండవ సంవత్సరం చదువుతున్న విష్ణుప్రియ అనే విద్యార్థిని మంగళవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అనంతపురం జనశక్తి నగర్కు చెందిన ఎన్.వి.మోహన్రెడ్డి భూగర్భ జలవనరుల శాఖలో ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందారు. ప్రస్తుతం ఆయన బళ్లారిలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె బెంగళూరులో ఉద్యోగం చేస్తోంది. రెండవ కుమార్తె విష్ణుప్రియకు కర్నూలు మెడికల్ కళాశాల ఆర్థోపెడిక్ విభాగంలో పీజీ సీటు రావడంతో మిడుతూరు డిప్యూటీ తహశీల్దార్గా పనిచేస్తున్న పిన్ని ఇంటిలో ఉండి వైద్య విద్య అభ్యసిస్తోంది.
మంగళవారం రాత్రి 7 గంటలకు విష్ణుప్రియ పిన్ని విధులు ముగించుకుని స్థానిక చాణక్యపురి కాలనీలోని తన నివాసానికి చేరుకోగా విష్ణుప్రియ ఉరేసుకుని ఉండడం కనిపించింది. వెంటనే కుటుంబ సభ్యులతో కలసి విష్ణుప్రియను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. విష్ణు ప్రియ ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. చలాకీగా, అందరితో కలుపుగోలుగా ఉండే విష్ణుప్రియ ఆత్మహత్య చేసుకుందంటే నమ్మలేకపోతున్నామని ఆర్థోపెడిక్ విభాగం సహచర వైద్యవిద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు...'నాన్నా...నన్ను క్షమించు. జీవితంలో ఓడిపోయాను. నేను బలహీనురాలిని. పోరాడే ధైర్యం లేదు'...అని విష్ణుప్రియ సూసైడ్ నోట్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
విష్ణుప్రియ బంధువుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న కర్నూలు మూడవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే మెడికో ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. కాలేజీలో ఏమైనా ఒత్తిడా...ర్యాగింగ్ కోణమా...లేక...ప్రేమ వ్యవహారమా ...ఇలా అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. త్వరలోనే ఈ వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు.