మైనర్ బాలుడి కిరాతకం! నాన్నను అవమానిస్తున్నారనే... అమ్మను , అక్కను చంపాడా..?
తూర్పుగోదావరి: తన తండ్రి అంటే ఆ కొడుకుకి ఎంతో ఇష్టం. కానీ, తన తండ్రికి తగిన గౌరవం ఇవ్వడం లేదని తల్లి, సోదరిపై అతడికి కోపం. ఆ కోపం రోజు రోజుకు పెరిగిపోయింది. చివరకు వారిద్దరి ప్రాణం తీసేంతవరకు వెళ్లింది. తన తండ్రిని అవమానిస్తున్నారనే కోపంతో ఏకంగా కన్న తల్లి, సోదరిని హత్య చేశాడు ఓ బాలుడు. ఈ దారుణ ఘటన తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురం పట్టణంలో చోటు చేసుకుంది.
రామచంద్రపురంలో ఆగస్టు 25న జరిగిన బలసా మాధురి, ఆమె కూతురు బలసా కరుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ మేరకు వివరాలను రామచంద్రపురం డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి, సీఐ శివగణేష్ మీడియాకు తెలిపారు.
తండ్రి రెండో పెళ్లి.. ఇంటికి రానివ్వని తల్లి
బలసా మాధురి భర్త బలసా శ్రీనివాస్ గత మూడేళ్ల నుంచి టీబీ వ్యాధితో బాధపడుతున్నారు. కాకినాడలో వైద్య చికిత్స చేయించుకుంటున్న సమయంలో లక్ష్మి అనే ఓ అనాథ మహిళతో శ్రీనివాస్కు పరిచయం ఏర్పడింది. దీంతో ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికీ ఏడాది పాప కూడా ఉంది. ఈ విషయం తెలిసిన మాధురి భర్తతో సరిగా ఉండటం లేదు.లక్ష్మిని వివాహం చేసుకోవడంతో గత మూడేళ్ల నుంచి శ్రీనివాస్ను ఇంటికి రానివ్వడం లేదు మాధురి.
తండ్రిని దూషిస్తుండటంతో..
అయితే, తనను మాధురి సరిగా చూడని కారణంగానే తాను మరో పెళ్లి చేసుకున్నానని తన కొడుకును నమ్మించాడు శ్రీనివాస్. దీంతో అతనికి తల్లిపై కొంత అసంతృప్తి నెలకొంది. అయినా, ప్రతి శనివారం వచ్చి తల్లి మాధురి దగ్గరకు వచ్చి ఆదివారం వరకు ఉండి వెళ్లేవాడు. వచ్చినప్పుడల్లా కొంత డబ్బు ఇచ్చి వెళ్లేవాడు. అయితే, కొడుకు వచ్చినప్పుడల్లా.. శ్రీనివాస్ను దూషించుకుంటూ మాట్లాడేది మాధురి. నీ సంపాదనంతా తండ్రి రోగానికే పెడుతున్నావు.. అతడు చస్తే గానీ నీవు బాగుపడవంటూ తల్లి, చెల్లి అతనితో అనేవారు. అంతేగాక, తండ్రికి చేతబడి చేయించి చంపిస్తామని బెదిరింపులకు గురిచేశారు.
నువ్వే వాళ్లను చంపమంటూ తండ్రి..
మొదట్నుంచి తండ్రి అంటే ఇష్టపడే ఆ కొడుకు.. తల్లి, చెల్లిపై కోపం పెంచుకున్నాడు. అమ్మ, అక్క చంపిస్తామంటూ బెదిరిస్తున్నారని ఓ రోజు తన తండ్రికి చెప్పాడు. దీంతో శ్రీనివాస్.. ఆ కొడుకును రెచ్చగొట్టాడు. తల్లి, చెల్లి అన్నంత పనిచేస్తారు.. నువ్వే వాళ్లను చంపితే తనకు ప్రశాంతంగా ఉంటుందంటూ శ్రీనివాస్.. తన కొడుక్కి చెప్పాడు.
అత్యంత దారుణంగా తల్లి, చెల్లి హత్య..
ఈ క్రమంలో తరచూ లాగే శనివారం కూడా తల్లి దగ్గరకు వెళ్లాడు కొడుకు. ఎప్పటిలాగే వారు తండ్రిని దూషించారు. ఇక రాత్రి వారు నిద్రించాక లేచిన బాలుడు.. తండ్రికి ఫోన్ చేసి, తల్లి, చెల్లిని చంపాలంటే భయమేస్తోందని చెప్పాడు. నీవు చంపకపోతే నేను, పిన్నీ విషం తాగి చచ్చిపోతామంటూ బెదిరించాడు. దీంతో సుత్తి, కత్తితో తల్లి, చెల్లిని అత్యంత దారుణంగా చంపేశాడు ఆ బాలుడు. అక్కడ ఆధారాలు లేకుండా చేసి, తల్లి సెల్ఫోన్ తీసుకుని పరారయ్యాడు.
పోలీసుల దర్యాప్తులో అసలు విషయం..
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తులో అసలు విషయం రాబట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీ, నిందితుడి సెల్ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా అతడ్ని పట్టుకున్నారు. బాలుడితోపాటు అతడి తండ్రిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో నిందితుడి తండ్రి తానే హత్యలు చేయమన్నట్లు అంగీకరించాడు. తండ్రిని కోర్టులో ప్రవేశపెట్టి జైలుకు తరలించిన పోలీసులు.. నిందితుడైన మైనర్ బాలుడిని జువైనల్ హోంకు తరలించారు.