తిరుపతిలో దారుణం: లిఫ్ట్ ఇచ్చి, మైనర్ బాలికపై ఇద్దరు అత్యాచారం
తిరుపతి: హైదరాబాద్ దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితులను ఎన్కౌంటర్ చేసినప్పటికీ కామాంధుల్లో ఎలాంటి భయం కనిపించడం లేదు. అలాంటి దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. తిరుపతిలో జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నవంబర్ 24న మధ్యాహ్నం తిరుపతి పద్మావతిపురం సర్కిల్ దగ్గర మైనర్ బాలిక(14) తిరుచానూరుకు వెళ్లేందుకు అటుగా బైక్పై వెళ్తున్న చిత్తూరు వెంకటేష్ను లిఫ్ట్ అడిగింది. ఆమెను తన బైక్పై ఎక్కించుకుని వెళ్తూ అతని స్నేహితడు, రౌడీషీటర్ అయిన రాజానాయక్ను ఈ విషయం చెప్పాడు.
తిరుచానూరులో వాహనాన్ని ఆపకుండా సమీపంలోని ముండ్లపూడిలోని ఒక నిర్మానుష్య ప్రాంతానికి బాలికను తీసుకెళ్లారు. అక్కడ వారిద్దరూ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెను వదిలేసి పరారయ్యారు.
బాధిత బాలిక ఫిర్యాదు మేరకు తిరుచానూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఆదివారం మధ్యాహ్నం నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. పద్మావతిపురం దగ్గర నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ మురళీకృష్ణ, సీఐ చిరంజీవి తెలిపారు.
కాగా, దిశ అత్యాచారం, హత్య కేసులోనిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేసిన విషయం తెలిసింద. ఈ కేసులో నిందితులు మహ్మద్ ఆరిఫ్, చింతకుంట చెన్నకేశవులు, జొల్లు నవీన్, జొల్లు శివను శుక్రవారం తెల్లవారుజామున దిశ హత్య జరిగిన చటాన్పల్లి బ్రిడ్జి దగ్గరకు తీసుకెళ్లారు పోలీసులు. ఆ తర్వాత ఆమెకు సంబంధించిన సెల్ఫోన్, వాచీ, పవర్ బ్యాంక్ పాతిపెట్టిన ప్రదేశాలను చూపించారు. ఈ సమయంలోనే నలుగురు నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేశారు.
రాళ్లు, కర్రలతో పోలీసులపై దాడి చేశారు. అంతేగాక, పోలీసుల దగ్గర్నుంచి తుపాకీలను లాక్కున్నారు మహ్మద్ ఆరిఫ్, చెన్నకేశవులు. లొంగిపోవాలంటూ పోలీసులు కోరినప్పటికీ నిందితులు వినకుండా కాల్పులు జరిపే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు ఎదురుకాల్పులు జరిపి నలుగురు నిందితులను మట్టుబెట్టారు. నిందితులు రాళ్లు, కర్రలతో దాడి చేయడంతో ఓ ఎస్ఐ, కానిస్టేబుల్కు గాయాలయ్యాయి. వారు హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు వివరాలను సీపీ సజ్జనార్ శుక్రవారం సాయంత్రం మీడియాకు తెలియజేశారు.