ఏపీలో మైనర్ బాలికపై ఏడాది పాటు ముగ్గురి అత్యాచారం .. ఆరు నెలల గర్భంతో బాలిక
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. మహిళలు,బాలికల సంరక్షణ కోసం ఎన్ని చట్టాలు వచ్చినా ప్రయోజనం లేకుండా పోతోంది. ఏపీలో దిశ చట్టం తీసుకుని వచ్చినా రోజురోజుకీ అత్యాచారాలు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. మొన్నటికి మొన్న విశాఖ ఏజెన్సీలో ఒక మైనర్ బాలికపై అత్యాచారం మరచిపోకముందే తాజాగా మైనర్ బాలికపై సంవత్సర కాలంగా ముగ్గురు యువకులు చేసిన దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బర్త్ డేకి పిలిచి బాలికపై అత్యాచారం .. గర్భం దాలిస్తే మాత్రలు వేసి... ఇద్దరు యువకుల దారుణం
ముగ్గురు ఏడాది కాలంగా బాలికపై అత్యాచారం
విశాఖపట్నం జిల్లా ఎలమంచిలి మండలం కొత్తపల్లి గ్రామంలో ఓ మైనర్ బాలికను మభ్యపెట్టి ముగ్గురు ఏడాది కాలంగా అత్యాచారానికి పాల్పడుతున్నారు. తల్లి, తండ్రి లేని ఓ మైనర్ బాలిక తన నాయనమ్మ, తాతయ్య వద్ద ఉంటుంది .తొమ్మిదో తరగతి వరకు చదువుకున్న బాలిక ప్రస్తుతం చదువు మానేసి ఇంట్లోనే ఉంటున్న క్రమంలో ఆ బాలికపై కన్నేశారు ముగ్గురు కామాంధులు. బాలిక నాయనమ్మ, తాతయ్య ఇద్దరు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ ప్రతిరోజు ఉదయం కూలికి వెళ్లేవారు.
బెదిరింపులతో అత్యాచారం .. గర్భవతి అయిన బాలిక
తాతయ్య, నాయనమ్మ వ్యవసాయ పనులకు వెళ్ళటంతో ఇంట్లో ఒంటరిగా బాలిక ఉండేది. ఆమెపై కన్నేసిన ముగ్గురు ఆమె అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఆమెని బెదిరిస్తూ ఏడాదికాలంగా అత్యాచారానికి పాల్పడుతున్నారు. ప్రస్తుతం ఆమె ఆరు నెలల గర్భవతి అయింది. బాలిక పొట్ట బాగా పెరగడంతో గమనించిన నాయనమ్మ బాలికను ప్రశ్నించడంతో బాలిక తనపై ఏడాది కాలంగా ముగ్గురు చేస్తున్న అఘాయిత్యాన్ని నాయనమ్మ, తాతయ్యలకు చెప్పింది. ఇక ఆసుపత్రికి తీసుకువెళ్లి పరీక్షలు చేయించడంతో బాలిక గర్భవతి అని తేలింది.
పోలీసులకు ఫిర్యాదు ..కేసు నమోదు .. కానీ ప్రశ్నార్ధకం అయిన బాలిక జీవితం
బాలిక ద్వారా ఏం జరిగిందో తెలుసుకున్న బాలిక బంధువులు ఆమెపై అత్యాచారానికి పాల్పడిన ముగ్గురిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారిలో ఒకరు పెయింటర్ కాగా మరొకరు భవన నిర్మాణ కార్మికుడు ,ఇంకొకరు వ్యవసాయ కూలీ అని గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అభం శుభం తెలియని , తల్లిదండ్రులు లేని, లోకం పోకడ పెద్దగా తెలియని ఆ బాలికపై ముగ్గురు కామాంధులు చేసిన దారుణానికి బాలిక జీవితం బలైపోయింది. ఇప్పుడు ఆరు నెలల గర్భవతి గా ఉన్న బాలిక పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. పశు ప్రవృత్తితో ముగ్గురు చేసిన పనికి మైనర్ బాలిక అందమైన బాల్యం చిద్రమైంది. బాలిక భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.
Recommended Video
ఇటీవల విశాఖ ఏజెన్సీలో ఇదే తరహాలో మరో బాలికపై ఘాతుకం .. బుగ్గిపాలవుతున్న బాల్యం
ఇటీవలే విశాఖ ఏజెన్సీలో జి.మాడుగుల మండల కె.కోడాపల్లి పంచాయతీ జిన్నేరు గ్రామానికి చెందిన 15 ఏళ్ల గిరిజన బాలికపై ఇద్దరు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. జి. మాడుగుల పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలా నిత్యం మైనర్ బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు బాలికల జీవితాన్ని నాశనం చేస్తున్నాయి. సమాజంలో ఒక అనారోగ్యకర వాతావరణం సృష్టిస్తున్నాయి.