దారుణం:తాను సహజీవనం చేస్తున్న వ్యక్తితో కూతురి మెడలో తాళి కట్టించిన తల్లి...రక్షించిన నానమ్మ
కడప:ఇటీవలి కాలంలో వెలుగు చూస్తున్న కొన్ని ఘటనలు సభ్య సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. కడపలో తాజాగా వెలుగు చూసిన ఒక ఉదంతం అమ్మ అనే పదానికే మచ్చ తెచ్చిన మహిళ దుర్మార్గానికి అద్దంపడుతోంది.
తాను వివాహేతర సంబంధం పెట్టుకొని అతడితో సహజీవనం చేస్తూ అదే వ్యక్తితో మైనర్ అయిన తన కుమార్తె మెడలో బలవంతంగా తాళి కట్టించింది ఈ తల్లి. అయితే బాలిక నాయనమ్మ ఈ పెళ్లి గురించి తెలిసి పోలీసులను ఆశ్రయించడంతో ఉన్నపళంగా ఉన్నతాధికారులు, రక్షిత టీమ్ ఆ గ్రామానికి వెళ్లి బలవంతపు పెళ్లికి కారణమైన నలుగురిపై కేసు నమోదుచేసి బాలికను రక్షించి నాయనమ్మ ఒడికి చేర్చారు. వివరాల్లోకి వెళితే...
కడప నగరం అక్కాయపల్లె ప్రాంతంలో ఓ మహిళ తన భర్తతో కలిసి నివాసం వుండేది. అయితే సుమారు 13 సంవత్సరాల క్రితం జీవనోపాధి కోసమని ఆ మహిళ 11 నెలల తన కూతురుని సుండుపల్లె మండలం గుట్టకిందపల్లెలో వుంటున్న అత్తమామలకు అప్పగించి కువైట్కు వెళ్లింది. ఆమె అక్కడ రెడ్డయ్య అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వారిద్దరు సుదీర్ఘకాలంగా అక్కడ సహజీవనం చేస్తూ వచ్చారు.
అయితే ఇటీవల వారిద్దరూ కలసి కడపకు వచ్చారు. ఇప్పుడు 14 సంవత్సరాల వయస్సులో వున్న తన కూతురుని రెడ్డయ్యకు ఇచ్చి పెళ్లి చేసేందుకు ఆమె నిర్ణయించుకుంది. ఆ ప్రకారం గత ఆదివారం సుండుపల్లెలో ఆ బాలిక ఈ పెళ్లికి నిరాకరిస్తుండగా కొట్టి బలవంతంగా తాళి కట్టించారు. అయితే ఈ విషయం ఆ బాలికను పెంచిన నాయనమ్మకు తెలిసింది. దీంతో ఆమె ఏం చెయ్యాలో స్థానికులను అడిగి కడప జిల్లాలో ఏర్పాటు చేసిన రక్షిత టీమ్ సభ్యులకు ఈ విషయమై ఫిర్యాదు చేసింది.
దీంతో కడప మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ వాసుదేవన్ ఆధ్వర్యంలో గురువారం అక్కడికి వెళ్లి పాపను విడిపించి నాయనమ్మకు అప్పగించారు. బలవంతపు పెళ్లి చేసిన మహిళ, ఆమె భర్త, రెడ్డయ్య సహా అతని సోదరుడిపై సుండుపల్లె పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయించారు. మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ వాసుదేవన్ గురువారం వివరాలను విలేకరులకు వెల్లడించారు.