ముస్లిం వలంటీర్: అర్చకుడికి ఆలయం వద్దే పింఛన్: మతసామరస్యానికి ప్రతీకగా: నెటిజన్ల ప్రశంసలు.. !
అనంతపురం: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు చెలరేగుతున్నాయి. దేశ రాజధానిలో హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. దాడులు, ప్రతిదాడులతో న్యూఢిల్లీ అట్టుడికిపోతోంది. 46 మంది అనుమానాస్పద స్థితిలో మరణించారు. పౌరసత్వ సవరణ చట్టం నిరసనలు ఒక దశలో మతకల్లోలాలకు దారి తీశాయి. వందలాది గృహాలు, వాహనాలు ధ్వంసం అయ్యాయి.
Recommended Video
ఇలాంటి పరిస్థితుల్లో మత సామరస్యాన్ని చాటి చెప్పే ఓ చిన్న ఘటన అనంతపురం జిల్లా హిందూపురంలో చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ఇంటి వద్దకే పింఛన్ పంపిణీ పథకం దీనికి కేంద్రబిందువైంది. హిందుపురానికి చెందిన వార్డు వలంటీర్.. ఓ ఆలయ అర్చకుడికి పింఛన్ సొమ్మును అందజేయడానికి గుడి వద్దకు వెళ్లారు. అర్చకుడికి అక్కడే పింఛన్ సొమ్మును అందజేశారు. దీనికి సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఆ వార్డు వలంటీర్ పేరు రజ్వీ సమీవుల్లా. హిందూపురంలో వార్డు వలంటీర్గా పని చేస్తున్నారు. తన పరిధిలో ఉన్న 50 ఇళ్లకు ఆయన ఆదివారం లబ్దిదారులకు పింఛన్ మొత్తాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తన పరిధిలో ఉన్న ఓ ఆలయ అర్చకుడు ఇంట్లో లేకపోవడంతో ఆయన పని చేస్తోన్న ఆలయానికి వెళ్లారు. ఆలయం వద్ద అర్చకుడి వేలి ముద్రలను తీసుకున్నారు. పింఛన్ మొత్తం 2,250 రూపాయల మొత్తాన్ని అందజేశారు.
బ్రాహ్మణి పొలిటికల్ గ్రాండ్ ఎంట్రీ? టీడీపీ సోషల్ మీడియా కోసం వర్క్షాప్..విందు: భర్తతో కలిసి..!
ఈ ఫొటో పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయాలంటూ డిమాండ్ చేస్తోన్న మద్దతుదారులు, వ్యతిరేకంగా నిరసనలు చేస్తోన్న ఆందోళనకారుల మధ్య దమనకాండ కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. ఇలాంటి మత సామరస్య వాతావరణమే మన దేశానికి అవసరం ఉందంటూ వ్యాఖ్యానిస్తున్నారు. కుల, మతాలకు అతీతంగా వ్యహరించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. గ్రామ వలంటీర్ల వ్యవస్థను ప్రశంసిస్తున్నారు.