పెను విషాదం: పెళ్లైన గంటలోనే గుండెపోటుతో వరుడు మృతి
కడప: అందరూ ఆనందంగా ఉన్న పెళ్లింట్లో అనూహ్య విషాదం. పెళ్లి జరిగిన గంట వ్యవధిలోనే పెండ్లి కుమారుడు మృతిచెందిన దరదృష్టకర సంఘటన కడప జిల్లా రాజుపాళెం మండలం కొర్రపాడు గ్రామంలోని బిసి కాలనీలో ఆదివారం చోటుచేసుకుంది. బీసీ కాలనీకి చెందిన సూర రామచంద్రారెడ్డి (24)కి ఆదివారం ఉదయం దేవుని కడపలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో కర్నూలు జిల్లాకు చెందిన ఒక అమ్మాయితో పెళ్లి జరిగింది.
అనంతరం వధూవరులు టాటాసుమోలో స్వగ్రామమైన కొర్రపాడుకు ఆదివారం మధ్యాహ్నం చేరుకున్నారు. ఇంట్లో పూజా కార్యక్రమాలు చేస్తుండగా ఆయన తాగేందుకు నీరు కావాలని వధువును కోరారు. ఆమె నీళ్లు తీసుకునివచ్చేలోగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.దీంతో కడప నుంచి వచ్చిన జీపులోనే ప్రొద్టుటూరు ఆస్పత్రికి తరలించారు.
అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధరించారు. విషయం తెలుసుకున్న బంధువులు, మిత్రులు విషాదంలో మునిగిపోయారు. తల్లి పద్మావతి సొమ్ముసిల్లి పడిపోయారు.
టాటా ఎసి ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న వరుడు రామచంద్రారెడ్డి తండ్రి కూడా రెండేళ్ల క్రితం ఇలాగే గుండెనొప్పి రావడంతో మృతిచెందాడు. తల్లి పద్మావతి, తమ్ముడు రామమునిరెడ్డితో కలిసి ఒకే ఇంటిలోనే నివాసముంటున్నారు.
వివాహమై కాళ్ల పారాణి ఆరకముందే వరుడు గుండెపోటుతో మృతిచెందడంపై ఇరు కుటుంబాల్లో విషాదం అమలుముకుంది. పిల్లాపాపలతో నూరేళ్లు జీవనం సాగించాల్సివున్న తన కుమారుడు ఇలా మృతిచెందడంతో తల్లి పద్మావతి గుండెలు కదిలేలా రోధించడంతో చూపరులను కలచివేసింది.
నవ వరుడు రామచంద్రారెడ్డికి ఆదివారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. పచ్చని పెళ్లిపందిరిలో వరుడు ఇలా విగతజీవుడై పడిన రామచంద్రారెడ్డిని కడసారి చూసేందుకు గ్రామంలోని వారే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా కొర్రపాడు గ్రామానికి చేరుకున్నారు.