చచ్చిపో: ప్రియుడిపై ప్రియురాలి కక్ష, పెళ్లైన 3రోజులకే ఆత్మహత్య
గుంటూరు: ప్రేమ వ్యవహారం ఓ నవ వరుడి ప్రాణం తీసింది. తనను వివాహం చేసుకోకుండా, పెద్దలు కుదుర్చిన సంబంధం చేసుకున్న ప్రియుడిపై ఓ ప్రియురాలు ప్రతీకారం తీర్చుకుంది.
తనను కాదని వేరే పెళ్లి ఎలా చేసుకున్నావని బెదిరించి, ప్రియుడిని ఆత్మహత్యకు ప్రేరేపించి అతడి చావుకు కారణమైంది. దీంతో పెళ్లి అయిన మూడోరోజే ఆ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన గుంటూరు జిల్లా ఈపూరు మండల కేంద్రంలో విషాదాన్ని నింపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈపూరుకు చెందిన మద్దం వెంకటేశ్వర్లు (24), గ్రామానికే చెందిన ఓ యువతి ప్రేమించుకున్నారు. పెద్దల ఒత్తిడి మేరకు వెంకటేశ్వర్లు తన బంధువుల అమ్మాయి సంధ్యారాణిని అయిదు రోజుల క్రితం (ఏప్రిల్ 29) వివాహం చేసుకున్నాడు.
కాగా, ప్రియురాలి సోదరులు చిట్టేటి శ్రీను, నాగేంద్రబాబు శనివారం వెంకటేశ్ను పార్టీ చేసుకుందామని పిలిచారు. ముగ్గురూ వెళ్లి పార్టీ చేసుకొన్నారు. తిరిగి వచ్చిన తర్వాత తమ అక్కను ప్రేమించి ఎందుకు పెళ్ళి చేసుకోలేదంటూ వారిద్దరూ వెంకటేశ్తో వాదనకు దిగారు.
అనంతరం వారి అక్కను తీసుకువచ్చి వెంకటేశ్ వద్ద వదిలి వెళ్లిపోయారు. తనను వివాహం చేసుకోనందుకు నిందించిన ప్రియురాలు, ఇద్దరం కలిసి చనిపోదామని వెంకటేశ్ వద్ద ప్రతిపాదించింది. దీంతో ఇద్దరూ కలిసి చనిపోదామని నిర్ణయించుకొన్నారు. పురుగుల మందు తీసుకొని రహస్య ప్రదేశానికి వెళ్లారు.
ముందుగా వెంకటేష్ పురుగుల మందు తాగాడు. ప్రియురాలు మాత్రం తాగలేదు. తాను ఎందుకు చనిపోవాలని ఎదురు ప్రశ్నించింది. తనకు త్వరలోనే గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందని, 'మోసం చేసినందుకు నువ్వే చావు' అంటూ ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే అప్పటికే రెండు గ్లాసుల పురుగుల మందు తాగిన వెంకటేశ్ ఇంటికి వచ్చి జరిగిన విషయం ఎవరికీ చెప్పుకోలేక మౌనంగా ఉన్నాడు.
కడుపులో నొప్పిగా ఉందని బాధపడుతున్న వెంకటేశ్ను తల్లిదండ్రులు ప్రశ్నించడంతో జరిగిన విషయం వివరించాడు. దీంతో అతడిని తొలుత వినుకొండలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రయోజనం కనిపించకపోవడంతో నరసరావుపేటలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి, అనంతరం గుంటూరులోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు.
చికిత్స పొందుతూ వెంకటేశ్ సోమవారం రాత్రి మృతి చెందాడు. వెంకటేశ్ తండ్రి దేవేంద్ర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు చేసున్నట్లు ఎస్ఐ ఉజ్వల్ కుమార్ తెలిపారు. పరారీలో ఉన్న ప్రియురాలి కోసం గాలింపు చేపట్టారు.