ఎంసెట్లో కొత్త విధానం:ఇక సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉండదు
కాకినాడ:ఇంజనీరింగ్ చదవాలనుకునే విద్యార్థులకు ఇది నిజంగా శుభవార్తే...ఎంసెట్లో క్వాలిఫై అయ్యాక హెల్ప్ సెంటర్ల పేరిట సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం విద్యార్థులకు నెలల తరబడి చుక్కలు చూపించే పాత విధానంకు ఫుల్ స్టాప్ పడనుంది.
చిన్నారి సంప్రీతి కీమోథెరపీ సాయం కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన
ఎంసెట్ విద్యార్థుల కోసం నూతనంగా అందుబాటులోకి తెస్తున్న ఓ సరి కొత్త విధానం విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉండనుంది. అదేమిటంటే...ఎంసెట్ క్వాలిఫైడ్ విద్యార్థులకు ఇక మీదట సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉండదు. దీనివల్ల విద్యార్థులకు ఎంతో సౌలభ్యం ఏర్పడటంతో పాటు గతంలో కంటే సుమారు 40 రోజుల ముందే ఇంజనీరింగ్ అడ్మిషన్లు జరిగే అవకాశం ఉంటుంది.
ఎంసెట్ నిర్వహణా సంస్థ కాకినాడ జేఎన్టీయూ ప్రతి సంవత్సరం ఎంసెట్ లో సంస్కరణలు అమలుచేస్తున్నసంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా ఎంసెట్ లో మరో కొత్త పద్దతి ప్రవేశపెడుతున్నట్లు ఎంసెట్ కన్వీనర్ ఆచార్య సి.హెచ్.సాయిబాబు మీడియాకు తెలిపారు. ప్రతి ఏఢాది ఎంసెట్ ఫలితాలు వచ్చాక సర్టిఫికెట్ల పరిశీలన కోసం నెల రోజుల పైబడే విద్యార్థులు నానా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. కౌన్సిలింగ్ కు ముందు ఎంసెట్ హెల్ప్ సెంటర్ల వద్ద పడిగాపులు పడుతూ తమ వంతు కోసం నిరీక్షించాల్సి వచ్చేది.
అయితే ఈ ఏడాది ఈ కష్టాలకు ముగింపు పలుకుతూ ఎంసెట్ రిజల్ట్స్ వచ్చిన వెంటనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ లేకుండా నేరుగా విద్యార్థుల ర్యాంకులను బట్టి ప్రవేశాలు పొందే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అదెలా సాధ్యమంటే..విద్యార్థులు అప్లికేషన్ పెట్టే సమయంలోనే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, స్థానికత వివరాలను సేకరిస్తారు. పదోతరగతి, ఇంటర్మీడియెట్ సర్టిఫికెట్లకు సంబంధించి ఆయా బోర్డులతో సంప్రదించి తీసుకుంటారు. దీనివల్ల విద్యార్థులు మళ్లీ హెల్ప్సెంటర్లకు వెళ్లి వెరిఫికేషన్ కు హాజరు కావాల్సిన అవసరం ఉండదు. అలాగే ఎంసెట్ దరఖాస్తుతో పాటు ఆన్లైన్లో ఆదాయ ధ్రువీకరణ, కుల ధ్రువీకరణ పత్రాలను కూడా అప్లోడ్ చేయాలంతే. ఈ విధానం వల్ల 40 రోజుల ముందుగా అడ్మిషన్లు ఇచ్చే అవకాశం ఉంటుందని ఎంసెట్ కన్వీనర్ పేర్కొన్నారు.