మార్కెట్లో కొత్త రకం బ్యాటరీ బైస్కిల్:రిజిస్ట్రేషన్లు,లైసెన్సులు అక్కర్లేదు!
తూర్పుగోదావరి:ఎపి లోకి కొత్త రకం వెహికల్ ప్రవేశించింది. చూడటానికి చిన్నపిల్లల బైస్కిల్ లాగా ఉండే ఇది నిజానికి సైకిల్ కాదు...ఎందుకంటే దీన్ని తొక్కాల్సిన పనే లేదు...అలాగని బైకా అంటే అదీ కాదు...ఎందుకంటే బైక్ కు ఉండాల్సిన రిజిస్ట్రేషన్లు,లైసెన్సులు ఏవీ దీనికి అక్కర్లేదు.
మరేమిటిది?...అంటే ఇదొక న్యూ ఇన్వెన్షన్...సైకిల్ కి బైక్ కి మధ్య రకంగా ఉండే ఈ సరికొత్త రకం వాహనం బ్యాటరీ తో నడుస్తుంది. అందుకే దీన్ని బ్యాటరీ బైస్కిల్ అంటున్నారు. గత కొంతకాలంగా ఇవి విదేశాల్లో లభ్యమవుతున్నా దేశీయంగా తయారీ లేదు. అయితే తాజాగా హైదరాబాద్కు చెందిన వెర్సటైల్ ఇండస్ట్రీస్ ఈ బ్యాటరీ బైస్కిల్ ని మార్కెట్లోకి విడుదల చేయగా...రాష్ట్రం నుంచి తూర్పుగోదావరి జిల్లా వాసి ఈ వాహనం సొంతం చేసుకున్న తొలి వ్యక్తిగా గుర్తింపు పొందినట్లు తెలుస్తోంది.
సైకిల్ అంటే సుదూరాలు తొక్కలేని పరిస్థితి...మోటార్ బైక్ వాడదామా అంటే...పెట్రోలు మొదలుకొని రిజిస్ట్రేషన్లు,లైసెన్సులు, ఇన్సూరెన్స్ లు ఇలా ఎన్నో బాదరబందీలు. వీటన్నింటికీ బెస్ట్ సొల్యూషన్ లా మార్కెట్లోకి దూసుకొచ్చింది ఈ సరికొత్త బ్యాటరీ బైస్కిల్....దీనిపేరు వీఈ-45...దీన్ని సైకిల్ లా కష్టపడి తొక్కనక్కరలేదు...బైక్ లాగా పెట్రోల్ పోయనవసరం లేదు.
మనం ఇంతవరకూ చూడని వెరైటీ రూపంతో విచిత్రంగా ఉండే ఈ బ్యాటరీ బైస్కిల్ ను ఒక్కసారి ఛార్జి చేస్తే గంటకు 25 కిలోమీటర్ల వేగంతో 45 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. అంతేకాదు ఈ సైకిల్కు అమర్చిన బ్యాటరీకి ఆరు నెలల గ్యారంటీ కూడా ఇస్తున్నారు. మొత్తం మీద ఈ బ్యాటరీ రెండేళ్ల పాటు పనిచేస్తుందని తయారీదారులు భరోసా కల్పిస్తున్నారు. ఆ తరువాత మళ్లీ నూతన బ్యాటరీని రీప్లేస్ చేసుకోవాల్సి ఉంటుందట.
ఇక వీఈ-45 బ్యాటరీ బైస్కిల్ ను రాష్ట్రంలోనే తొలిసారిగా అమలాపురం పట్టణానికి చెందిన యాళ్ల సూర్యశంకర అప్పలరాజు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఆయన ఈ బ్యాటరీ బైస్కిల్ను హైదరాబాద్ లో కొని తీసుకువచ్చారు. ప్రస్తుతం ఈ బ్యాటరీ బైస్కిల్ ధర రూ. 21 వేలు కాగా, అదనంగా జీఎస్టీ చెల్లించాల్సి వస్తుంది. మహిళలకు బాగా అనువుగా ఉండే ఈ వాహనం ప్రస్తుతం ఆయన కుటుంబ సభ్యులు వినియోగిస్తున్నారు.