పెళ్లయిన నెలకే దారుణం : రాజమండ్రిలో వివాహిత ఆత్మహత్య
రాజమహేంద్రవరం : పెళ్లయిన నెల రోజులకే అదనపు కట్నం వేధింపులకు గురవడంతో.. తీవ్ర మనస్థాపానికి గురైన ఓ వివాహిత తనువు చాలించింది. రాజమండ్రి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముంటున్న నూకల లక్ష్మి అనే వివాహిత కట్నం వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడింది.
వివరాల్లోకి వెళితే.. ఆనంద్ నగర్ కు చెందిన లక్ష్మి(24), సిద్ధార్థనగర్ కు చెందిన వీర్రాజు అనే లారీ డ్రైవర్ మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. ఈ క్రమంలోనే గత జూలై 3వ తేదీన 2అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధిలో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ప్రేమ వివాహమే అయినా.. పెళ్లి సమయంలో లక్ష్మి తల్లిదండ్రులు రూ.2లక్షల కట్నంతో పాటు కొంత బంగారం వీర్రాజుకు ముట్టజెప్పారు.
వివాహనంతరం కాతేరు పంచాయితీ పరిధిలో ఉన్న శాంతినగర్ కాలనీలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని నివాసముంటున్నారు. కాగా, పెళ్లయిన కొద్ది రోజులకే లారీపై ఏదో బాకీ ఉందంటే.. వీర్రాజుకు మరో రూ.28వేలు ఇచ్చారు లక్ష్మి తల్లిదండ్రులు.
ఈ నేపథ్యంలోనే.. అదనపు కట్నం కోసం లక్ష్మిని వేధించడం మొదలుపెట్టాడు వీర్రాజు. తనకు మంచి మంచి సంబంధాలు వస్తున్నాయని, ఒప్పుకుంటే రూ.7లక్షల కట్నం వస్తుందని ఆమెను వేధించ సాగాడు. దీంతో భర్త వేధింపులకు తీవ్రంగా మనస్తాపానికి లోనైన లక్ష్మి.. మంగళవారం నాడు ఇంట్లో ఉన్న శ్లాబ్ హుక్కుకు ఓణీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఇదిలా ఉంటే.. లక్ష్మిది ఆత్మహత్య కాదని, వీర్రాజే ఆమెను హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని లక్ష్మి తల్లి మచ్చా మహాలక్ష్మి ఆరోపిస్తోంది. పెళ్లయి నెలరోజులు కూడా గడవక ముందే కుమార్తె మరణించడం పట్ల తీవ్ర ఆవేదన చెందుతోంది మహాలక్ష్మి. ఘటనా స్థలాన్ని పరిశీలించిన సెంట్రల్ జోన్ డీఎస్పీ కులశేఖర్ త్రీ టౌన్ శ్రీరామ కోటేశ్వరరావు పలు వివరాలను సేకరించారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది.