ప్రేమ-మోసం: నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి
జిల్లాలోని తణుకులో ఆదివారం రాత్రి విషాద ఘటన చోటుచేసుకుంది. కడుపునొప్పి తాళలేక తన వద్ద ఉన్న ఇంజక్షన్ చేసుకున్న ఓ నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆత్మహత్యకు పాల్పడిన హెప్సి
పశ్చిమగోదావరి: జిల్లాలోని తణుకులో ఆదివారం రాత్రి విషాద ఘటన చోటుచేసుకుంది. కడుపునొప్పి తాళలేక తన వద్ద ఉన్న ఇంజక్షన్ చేసుకున్న ఓ నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. ఇరగవరం మండలం అర్జునుడుపాలెం గ్రామానికి చెందిన మల్లిపూడి హెప్సిబారాణి(21) తణుకులోని ఓ ప్రైవేటు నర్సింగ్ కళాశాలలో జీఎన్ఎం కోర్సు తృతీయ సంవత్సరం చదువుతున్నారు.
ఆదివారం సాయంత్రం కడుపునొప్పిగా ఉందని వార్డెన్, సహచర విద్యార్థినులతో ఆమె చెప్పారు. అందుబాటులో మందులు లేవని వార్డెన్ జగదీశ్వరి చెప్పడంతో తన వద్ద ఉన్న ఇంజక్షన్ చేయాలని కోరారు. అందుకు ఆమె నిరాకరించారు. దీంతో హెప్సిబారాణి తనకు తానే ఇంజక్షన్ చేసుకున్నారు.
Recommended Video
ఆమె వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లడాన్ని గమనించిన సహచర విద్యార్థినులు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధరించారు. ఇది ఇలా ఉండగా, హెప్సిబారాణి తల్లిదండ్రులు మృతి చెందడంతో పెరవలి మండలం అజ్జరం గ్రామానికి చెందిన పాస్టర్ డి బెన్హామ్ ఆమెను అక్కున చేర్చుకుని చదివిస్తున్నారు.
హెప్సిబారాణి రెండు రోజుల క్రితం ప్రయోగశాల పరీక్ష (ప్రాక్టికల్స్) కోసం విజయవాడ వెళ్లి వచ్చినట్లు సహచర విద్యార్థినులు చెబుతున్నారు. అక్టోబర్ 23న మరో పరీక్షకు వెళ్లాల్సి ఉంది. హెప్సిబారాణి వద్ద సెల్ఫోన్ పాటు ఓ లేఖ లభించింది. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఆ లేఖలో 'నన్నెందుకిలా మోసం చేశావు? నా జీవితాన్ని నాశనం చేశావ్' అని రాసి ఉంది. ఈ నేపథ్యంలో ప్రేమించిన వ్యక్తి మోసం చేయడంతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. పోలీసులు అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.