ఢిల్లీ మత ప్రార్థనల కల్లోలం: తూ.గో. జిల్లా చర్చిలో సామూహికంగా సండే ప్రేయర్స్: 150 మందితో
కాకినాడ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతూనే వస్తున్నాయి. అత్యధిక శాతం పాజిటివ్ కేసులకు ప్రధాన కారణం ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ మసీదులో నిర్వహించిన తబ్లిగి జమాత్ సామూహిక మత ప్రార్థనలేనంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ.. ఏపీలో అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది.
Recommended Video
మాస్కులైనా లేకుండా..
తూర్పు గోదావరి జిల్లా రాయవరంలోని ఓ చర్చిలో సామూహిక మత ప్రార్థనలను నిర్వహించి ఘటన కలకలం రేపింది. లాక్డౌన్ అమల్లో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఒకేసారి 150 మంది ఒకేచోట గుమికూడటం, ఆదివారం నాటి ప్రార్థనల్లో పాల్గొనటం వల్ల భీతావహ పరిస్థితులు ఏర్పడ్డాయి. వారిలో చాలామంది ఎలాంటి మాస్కులను కూడా ధరించలేదని, వైరస్ సోకకుండా ఎలాంటి ముందుజాగ్రత్తలను కూడా తీసుకోలేదని చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
చర్చి పాస్టర్పై కేసు నమోదు..
రాయవరం చర్చిలో ఆదివారం నాటి ప్రార్థనలను నిర్వహిస్తున్నట్లు తెలిసిన వెంటనే స్థానికులు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు చర్చి వద్దకు చేరుకున్నారు. ప్రార్థనలను నిలిపివేశారు. ప్రార్థనల్లో పాల్గొన్న వారిని బయటికి పంపించి వేశారు. సుమారు 150 మంది వరకు ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారని చెబుతున్నారు. లాక్డౌన్ సమయంలో ప్రజలను పోగు చేయడం, నిబంధనలను ఉల్లంఘించిన ఆరోపణలపై చర్చి పాస్టర్పై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కేసులు ఎక్కువే..
తూర్పు గోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదు అయ్యాయి. ఇప్పటికే 11 పాజిటివ్ కేసులతో జిల్లావాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అదే సమయంలో చర్చిలో పెద్ద సంఖ్యలో మత ప్రార్థనలను నిర్వహించడం వల్ల మరింత భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి. వారిలో ఏ ఒక్కరికి కరోనా లక్షణాలు ఉన్నా.. దాని తీవ్రత భయానకంగా ఉంటుందని, వారి వల్ల చాలామందికి వైరస్ సోకే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్త చేస్తున్నారు.
80 శాతం కేసులు ఢిల్లీ ప్రార్థనలతో ముడిపడి ఉన్నవే..
ఆదివారం నాటికి రాష్ట్రంలో మొత్తం 226 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. వాటిల్లో 80 శాతం కేసులు ఢిల్లీలోని తబ్లిగి జమాత్ ప్రార్థనలతో ముడిపడి ఉన్నవేనంటూ ఇప్పటికే ప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసిందే. అలాంటి పరిస్థితుల్లో మరోసారి 150 మంది వరకు స్థానికులు ఒకేసారి, ఒకేచోట గుమికూడిన సంఘటన ప్రభావం మరింత తీవ్రంగా ఉండే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.