వైఎస్ వివేకా హత్యోదంతంపై హైకోర్టులో దాఖలైన మరో పిటీషన్.. వాయిదా!
అమరావతి: రాష్ట్రంలో పెను సంచలనం రేపిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్యోదంతంపై దాఖలైన పిటీషన్ పై విచారణ మంగళవారానికి వాయిదా పడింది. వివేకానంద రెడ్డి భార్య సౌభాగమ్య సోమవారం ఈ పిటీషన్ ను దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు.. మంగళవారానికి వాయిదా వేసింది.
ఆంధ్రప్రదేశ్ పోలీసులపై తమకు నమ్మకం లేదని, కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేలా వ్యవహరిస్తున్నారని కొంతకాలంగా వైఎస్ కుటుంబీకులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసును వారు సీబీఐకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. సీబీఐకి అప్పగించితేనే అసలు దోషులు ఎవరో తేలుతారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా, వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీత, భార్య సౌభాగమ్య డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.
తన పినతండ్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యోదంతం వెనుక గల దోషులను బయటికి తేవడానికి ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ వైఎస్ జగన్ ఇదివరకే హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. నాలుగురోజుల కిందట ఈ పిటీషన్ దాఖలైంది. అయినప్పటికీ- ఈ పిటీషన్ విచారణకు రాలేదు.
కనీసం నంబరింగ్ కూడా ఇవ్వలేదని వైఎస్ వివేకా కుటుంబీకులు చెబుతున్నారు. జగన్ పిటిషన్ వేసి రోజులు గడుస్తున్నప్పటికీ.. హైకోర్టులో నంబరింగ్ అవకపోవడంతో వివేకా కుటుంబీకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నంబరింగ్ కేటాయించేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ సౌభాగ్యమ్మ తాజాగా మరో పిటిషన్ వేశారు. హైకోర్టు దీన్ని విచారణకు స్వీకరించింది. అనంతరం మంగళవారానికి వాయిదా వేసింది.
వివేకా హత్యోదంతంపై సీబీఐ ద్వారా విచారణ జరిపించాలని కోరుతూ.. కుమార్తె డాక్టర్ సునీత ఇదివరకే కేంద్ర ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరాను కలిసిన విషయం తెలిసిందే. చంద్రబాబు కనుసన్నల్లో పనిచేస్తోన్న సిట్ వల్ల ఉపయోగం లేదని ఆమె ఆరోపించారు. ఈ మేరకు రెండురోజుల కిందట న్యూఢిల్లీలో సునీల్ అరోరాను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు.