ప్రత్యేక హోదా కోసం ప్రైవేట్ గుమాస్తా బలిదానం...చంద్రబాబుకు సూసైడ్ నోట్
ఒంగోలు:ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం బలి దానాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రం కు హోదాని ఆకాంక్షిస్తూ ఒంగోలులో పైడికొండల యానాదయ్య (47) అనే చిరుద్యోగి పురుగు మందు తాగి బలవన్మరణం చెందాడు.
జేబులో ఉన్న సూసైడ్ నోట్ ఆధారంగా ఆయన ప్రత్యేక హోదా కోసమే అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి అతడు లేఖ రాస్తూ కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేసిందని...నాకు జరిగిన అన్యాయం నా పిల్లలకు జరగకూడదనే ఉద్దేశ్యంతో బలిదానం చేస్తున్నట్లు పేర్కొన్నాడు. తన బిడ్డలకు టిడిపి తరుపున మీరే పెద్దదిక్కుగా ఉండాలని ఒంగోలు ఎమ్మెల్యే జనార్ధన్ ను కోరాడు.
వైఎస్సార్ కడప జిల్లా రాజంపేటకు చెందిన యానాదయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉపాధి కోసం పదేళ్ల క్రితం ఒంగోలు వచ్చిన ఆయన నగరంలోని కమ్మపాలెంలో నివాసం ఉంటున్నాడు. నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలులోని ఒక సిమెంటు కొట్లో గుమస్తాగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే గురువారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిన ఆయన మళ్లీ తిరిగి రాలేదు.
ఈ క్రమంలో ఆదివారం రాత్రి దశరాజుపల్లికి వెళ్లే రోడ్డులో ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద ఓ వ్యక్తి మృతి చెంది ఉండటాన్ని అటుగా వెళుతున్న ఒక వ్యక్తి గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా అతని జేబులో సూసైడ్ నోట్ దొరికింది. ఆ లేఖ ఈనెల 6 వ తేదీన రాసినట్లుగా తేదీ వేసి ఉంది. ఆ సూసైడ్ నోట్ ను అతడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఉద్దేశించి రాశాడు.
ఆ సూసైడ్ నోట్ యథాతథంగా...నవ్యాంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి గారికి..."ప్రకాశం జిల్లా ఒంగోలులోని కమ్మపాలెంలో నివాసం ఉండే పైడికొండలు యానాదయ్య అను నేను రాస్తున్నది ఏమనగా కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రం పట్ల చిన్నచూపు చూసింది. కట్టుబట్టలతో బయటకు పంపించారు. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా వస్తుందని ఎదురుచూసినా బీజేపీ మోసం చేసింది. నాకు జరిగిన అన్యాయం మా పిల్లలకు జరగకూడదని మన నాయకులంతా కలసికట్టుగా పోరాడి ప్రత్యేక హోదా సాధిస్తారని, నా బలి దానంతోనైనా కేంద్ర ప్రభుత్వం దిగి వస్తుందని ఆశిస్తూ సెలవు" అని రాసి ఉంది.
అలాగే ఆ లేఖలో దిగువన...నా బిడ్డలకు టీడీపీ తరఫున మీరే పెద్ద దిక్కుగా ఉండాలని ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్ను ఆ వ్యక్తి తన లేఖలో కోరారు. సంఘటనా స్థలంలో పురుగు మందు డబ్బాను పోలీసులు గుర్తించారు. తాలూకా ఎస్సై రాజారావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే వ్యక్తి ఆత్మహత్య విషయాన్ని అన్ని కోణాల్లో సమగ్రంగా విచారిస్తామని పోలీసులు చెబుతున్నారు.