పాత్రికేయుడి దారుణ హత్య: ఆటవిక చర్యంటూ పవన్ కళ్యాణ్ ఆగ్రహం
తూర్పుగోదావరి: జిల్లాలోని తుని మండలంలో ఓ పాత్రికేయుడు దారుణ హత్యకు గురయ్యాడు. మండలంలోని ఎస్. అన్నవరం గ్రామంలోని లక్ష్మీదేవి చెరువుగట్టుపై కాటా సత్యనారాయణ(45) అనే పాత్రికేయుడిని దండగులు కత్తులతో దాడి చేసి హతమార్చారు. మృతుడు తొండంగి మండలంలో ఆంధ్రజ్యోతి పత్రికకు విలేకరిగా పనిచేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
సత్యనారాయణ హత్యపై రాజకీయ పార్టీల నేతలతోపాటు జర్నలిస్టులు తీవ్ర ఖండించారు. సత్యనారాయణ హత్య ఆటవిక చర్యగా అభివర్ణించారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఈ సంఘటన జరిగిన తీరు చూస్తే మనం ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నామా? అని అనిపించకమానదని అన్నారు.
ఈ సంఘటన ప్రజాస్వామ్యానికి మూల స్తంభమైన జర్నలిజాన్ని చంపినట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. ఇంత భయంకరంగా భయపెడితేనే తప్ప కలాలకు సంకెళ్లు వేయలేమని నిర్ణయానికి వచ్చి ఈ హత్యకు పాల్పడినట్లు కనిపిస్తోందన్నారు. సత్యనారాయణ ఇంటికి కూతవేటు దూరంలోనే నడిరోడ్డుపై ఈ హత్యకు పాల్పడ్డారంటే దీని వెనుక పెద్ద కుట్రే దాగి వుంటుందని అనుమానించక తప్పదని వ్యాఖ్యానించారు.
సత్యనారాయణపై నెల కిందట ఒకసారి హత్యాయత్నం జరిగి, అది పోలీసుల వరకు వెళ్లినప్పటికీ అతనికి రక్షణ కల్పించకపోవడం దారుణమన్నారు. పాత్రికేయుడు సత్యనారాయణ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం పక్షపాతం చూపకుండా దీని వెనుక ఉన్న దోషులను చట్టం ముందు నిలబెట్టి శిక్షించాలని, సత్యనారాయణ కుటుంబానికి న్యాయబద్ధమైన పరిహారాన్ని ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. సత్యనారాయణ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.