నాకు తెలిసిన సావిత్రి గారు...ఆ మహానటి దాతృత్వం గురించి ఓ రిటైర్డ్ బ్యాంకు మేనేజర్ జ్ఞాపకం
గుంటూరు:ఒకనాటి మేటి తార సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా నిర్మితమై సూపర్ హిట్ అయిన "మహానటి" చిత్రం తరువాత ఆ మహానటి జీవితంలోని పలు ఘట్టాల గురించి అంతటా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సావిత్రి లోని గుణగణాల గురించి ఆ మహానటి గురించి తమకు తెలిసిన విషయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
ఆ క్రమంలో సావిత్రి గారి దాతృత్వం గురించి తనకు తెలిసిన విషయాన్ని ఒ రిటైర్డ్ బ్యాంకు మేనేజర్ wiral అనే ఫేస్ బుక్ అకౌంట్ లో వివరించారు. సావిత్రి అభిమాని అయిన ఆయన ఆనాటి ఘటనను తన మనసులో పదిలంగా నిక్షిప్తం చేసుకోవడంతో పాటు ఇప్పుడు సావిత్రి దాతృత్వం గురించి చర్చ జరుగుతున్న ఈ తరుణంలో ఆ నాటి జ్ఞాపకాలను కళ్లకు కట్టినట్లుగా వివరించారు. అందుకే ఆయన రాసిన పోస్ట్ ను యథాతథంగా ఇక్కడ మీకు అందిస్తున్నాను.

...నేను రేపల్లె స్టేట్ బ్యాంకు లో 1972 నుండీ 1984 వరకు పని చేసాను.అప్పుడు Correspondent S S G H School వడ్డివారిపాలెం పేర మా బ్యాంకు లో Current Account ఉండేది. S S G H School అంటే శ్రీమతి సావిత్రి గణేశన్ హైస్కూల్ అని అర్ధం. సావిత్రి గారు తన స్వగ్రామములో పేద విద్యార్ధుల సౌకర్యార్ధం స్థాపించిన స్కూల్ అది. కేవలం సావిత్రి గారి ఆర్ధిక సహాయముతోనే స్థాపించబడిన స్కూలు అది. ఆ తర్వాత ప్రభుత్వము వారిచే గుర్తించబడి , కొంత ఆలస్యముగా ప్రభుత్వము వారిచే ఉపాధ్యాయులకు నెలసరి జీతములు విడుదల చేయబడుతూ నడపపడుతున్న స్కూలు అది.గవర్నమెంటు గ్రాంటు లేకపోతే ఆరు నెలలైనా ఉపాధ్యాయులకు జీతాలు అందేవి కావు.
వారి స్కూలు తరఫున ఉద్యోగి తమ స్టాఫ్ జీతములందరి చెక్కు మార్చుకొనడానికి మా బ్యాంకుకు వచ్చేవారు . సావిత్రి గారి మీద ఉన్న అభిమానముతో ఆ ఉద్యోగులను పలకరిస్తుండే వాడిని . సుమారు అయిదు నెలలు మా బ్యాంకు తో పని పడక ఆ స్కూలు వారెవరూ మా బ్యాంకు కు రాలేదు. ఒక రోజు నేను మా బ్యాంకు లో Current Account Counter లో పని చేస్తున్నప్పుడు ఆ స్కూలు ఉద్యోగి సావిత్రి గారి సంతకముతో ఉన్న రూ.104000 /_ రూపాయల మద్రాసు ( ఇప్పుడు చెన్నై ) చెక్కు క్లియరెన్స్ కోసము తమ ఖాతాలో జమ చేయడానికి తీసుకుని వచ్చారు.1975 ప్రాంతంలో రూ. 104000 /- అంటే ఈ రోజుల్లో షుమారు రూ. 40 లక్షలు పైనే .
మామూలుగా ఆ ఖాతాలో గవర్నమెంటు బిల్లు జమ చేయబడ్డాక Correspondent సంతకం చేసిన చెక్కు ద్వారా డబ్బులు Withdraw చేసుకుంటారు .
అదీ Regular గా జరిగే Procedure.
దానికి భిన్నంగా సావిత్రి గారి సంతకముతో తమ స్కూలు ఖాతాలో జమ చేయడానికి చెక్కు రావడంతో ఆసక్తి ఆపుకోలేని నేను " ఇదేమిటి సర్ !! రొటిన్ కు భిన్నంగా సావిత్రి గారి సంతకముతో చెక్కు తెచ్చారు ? " అని అడిగాను. దానికి అతను " ఈ మధ్య సావిత్రి గారు స్కూలు ఎలా నడుస్తోంది ? అని మా Corrspondent గారిని ఫోనులో అడిగారు సర్ . దానికి మా Correspondent గారు అయిదు నెలల నుండీ ప్రభుత్వ గ్రాంటు లేక పని చేసే ఉపాధ్యాయులకు , సిబ్బందికి జీతాలు లేవమ్మా తిండికి లేక చాలా ఇబ్బంది పడుతున్నారమ్మా అని చెప్పారు.
ఆ విషయం విన్న సావిత్రి గారు Correspondent గారిని వెంటనే మద్రాసు రమ్మన్నారు. మా Correspondent గారు వెంటనే మద్రాసు వెళ్ళారు. సిబ్బందికి అయిదు నెలలుగా జీతాలు లేక ఇబ్బంది పడుతున్నారని తెలుసుకున్న సావిత్రి గారు ఎంతో కదిలిపోయి తన స్వంత డబ్బులు రూ. 104000 /- మొత్తం అయిదు నెలలు బకాయిలకు చెక్కు రాసిచ్చి ముందు సిబ్బంది బకాయిలు చెల్లించండి. తర్వాత గ్రాంట్ సంగతి మనం చూసుకోవచ్చును అని అన్నారు సర్. " అని నాకు చెప్పారు .
ఇంతకన్నా ఆ మహాతల్లి దాతృత్వానికి నిదర్శనం ఏం కావాలి ?
సావిత్రి గారికి నీరాజనాలతో .
Source:Rtd Repalle Bank Manager 🙏💐
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!