తండ్రికి ఎంత కష్టం: కోడలు కళ్లలో కారం చల్లింది.. కొడుకు చితక్కొట్టాడు.. అంతా పబ్లిక్గానే!
తిరుపతి: జన్మనిచ్చిన తల్లిదండ్రులపై జాలి, ప్రేమ లేనివాడు పుట్టినా ఒక్కటే, చచ్చినా ఒక్కటే. వాడి బతుకు పుట్టలోని చెదలు లాంటింది. చెదలు పుడితే ఎంత? చస్తే ఎంత? అంటూ యోగి వేమన ఎప్పుడో చెప్పారు. ఇప్పుడు అలాంటి సంఘటన ప్రత్యక్షంగా చోటు చేసుకుంది. ఆలయాల నగరంగా పేరున్న తిరుపతిలో పట్టపగలు, నడి వీధిలో దయలేని పుత్రుడొకడు రెచ్చిపోయాడు. తన భార్యతో కలిసి కన్నతండ్రి మీదే కత్తి దూశాడు. ఇనుప రాడ్ తో విచక్షణా రహితంగా చావగొట్టాడు. కన్నతండ్రిని చితగ్గొడుతుంటే వారించాల్సిన భార్య తనవంతు సహకారం అందించింది. మామ శరీరానికి తగిలిన గాయాలపై కారాన్ని పూసింది.
వయోధిక వృద్ధుడని కూడా చూడలేదు. వీధిలో పరుగెత్తించి మరీ కొట్టారు. అడ్డొచ్చిన స్థానికులపైనా వీరంగం సృష్టించారా దంపతులు. పోలీసులు వచ్చిన తరువాత గానీ వారు శాంతించలేదంటే.. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. కన్న కుమారుడు, కోడలి చేతిలో చావుదెబ్బలు తిన్న ఆ వృద్ధ తండ్రి ప్రస్తుతం తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పట్లో కోలుకోలేకపోవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. శరీరానికి తీవ్ర గాయాలు అయ్యాయని, వయోభారం దృష్ట్యా ఆయన శరీరం వైద్య చికిత్సకు పూర్తిగా సహకరించట్లేదని డాక్టర్లు వెల్లడించారు.
ఇంట్లో వాటా కావాలంటూ గొడవ..!
కన్నతండ్రిని రోడ్డు మీదికి ఈడ్చాడో కర్కష కుమారుడు. తన భార్యతో కలిసి దాడి చేశాడు. వయోధిక వృద్ధుడని కూడా చూడకుండా చావబాదాడు. కంట్లో కారం చల్లి మరీ కొట్టారు. తగిలిన గాయాలపై కారాన్ని పూశారు. తప్పించుకోవడానికి ప్రయత్నించిన ఆ వృద్ధడి కళ్లలో కారం చల్లింది ఆయన కోడలు. వెంటపడి మరీ తరిమి కొట్టారు. బాధితుడి పేరు మునికృష్ణయ్య. వయస్సు 80 సంవత్సరాలు పైమాటే. భార్య కృష్ణవేణమ్మతో కలిసి తిరుపతిలోని అనంతవీధిలో నివాసం ఉంటున్నారు. వారికి విజయభాస్కర్, తులసీరామ్ కుమారులు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. మునికృష్ణయ్య అప్పులు చేసి, ఉండటానికి ఇంటిని కట్టుకున్నారు. ఈ అప్పులే ఇప్పుడాయన ప్రాణం మీదికి తీసుకొచ్చాయి.
ఆస్తులకు వారసులే గానీ.. అప్పులకు కాదంటూ..!
తండ్రి చేసిన అప్పులకు తాము బాధ్యులం కాదంటూ కుమారులిద్దరూ తిరుపతిలోనే వేరుగా నివసిస్తున్నారు. దీనితో మునికృష్ణయ్య దంపతుల పోషణ కష్టతరమైంది. ఈ విషయంలో విజయభాస్కర్, తులసీరామ్ రాజీ పడ్డారు. వంతులవారీగా తల్లిదండ్రులను పోషించే బాధ్యతను తీసుకున్నారు. ఇంటి కోసం చేసిన అప్పును తీర్చే బాధ్యతను తులసీరామ్ తీసుకున్నాడు. అప్పులు తీరిన తరువాత ఆ ఇంటిని తన పేరు మీద రాయించుకోవాలనేది అతని ఉద్దేశం. ఈ విషయం తెలుసుకున్న పెద్ద కుమారుడు విజయ్భాస్కర్, నీరజ తండ్రితో నిత్యం గొడవ పడేవారు. ఇంట్లో తమకూ వాటా ఇవ్వాలని ఘర్షణకు దిగేవారు. అంతేకాకుండా- వారు కూడా అనంతవీధిలోని సొంతింట్లోనే నివసించసాగారు. విజయ భాస్కర్కు ఇంట్లో వాటా ఇవ్వడానికి మునికృష్ణయ్య కృష్ణవేణమ్మ అంగీకరించలేదు. కోడలు నీరజ సోదరుడు వంశీకృష్ణ తమ అక్క, బావకు మద్దతుగా, తరచూ మునికృష్ణయ్యను వేధించేవాడు.
రాడ్డు తీసుకుని ఇంట్లో నుంచి తరమి కొట్టిన పెద్ద కుమారుడు..
మంగళవారం వారి మధ్య ఘర్షణ తీవ్రరూపం దాల్చింది. ఆవేశంతో ఊగిపోయిన విజయ్భాస్కర్ తండ్రిపై దాడికి పాల్పడ్డాడు. మునికృష్ణయ్య భయంతో వీధిలోకి పరుగెత్తినా వెంటపడి చావబాదాడు. కోడలు నీరజ కూడా కారం డబ్బా పట్టుకుని మామ కళ్లలో కొడుతుంటే విజయ్భాస్కర్ తండ్రిపై దాడి చేశాడు. స్థానికులు వారిని అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీనితో వారు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న వెంటనే అనంతవీధికి చేరుకున్న పోలీసులు విజయభాస్కర్, నీరజలను అదుపులోకి తీసుకున్నారు. మునికృష్ణయ్యను చికిత్స కోసం రూయా ఆసుపత్రికి తరలించారు. మునికృష్ణయ్య ఫిర్యాదు మేరకు విజయ్భాస్కర్, నీరజ, ఆమె తమ్ముడు వంశీకృష్ణపై పోలీసులు కేసు నమోదు చేశారు.
చలించిన డాక్టర్లు..
కుమారుడు, కోడలి చేతుల్లో తీవ్రంగా గాయపడ్డ మునికృష్ణయ్య ప్రస్తుతం రుయా ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆయన శరీరం వైద్యానికి సహకరించట్లేదని డాక్టర్లు చెబుతున్నారు. శరీరానికి లోతైన గాయాలయ్యాయని తెలిపారు. కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని తెలిపారు. ఆయన తగిలిన దెబ్బలను చూసి డాక్టర్లు కూడా చలించిపోయారు. పోలీసులు సైతం అవాక్కయ్యారు. విజయభాస్కర్, అతని భార్య నీరజలపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.