ప్రతినెలా రూ. కోటి అంటే ఎలా?, పీడించాలా?: ఓ ఎస్ఐ ఆవేదన
అమరావతి: ప్రతీ నెలా కోటి రూపాయలు ఇవ్వాలంటూ అధికార పార్టీ నేతలతోపాటు తమ శాఖ ఉన్నతాధికారులు ఒత్తిడి చేస్తున్నారంటూ నెల్లూరు జిల్లా కలెక్టర్కు ఓ ఎస్ఐ లేఖ రాయడం ఇప్పుడు జిల్లాలో కలకలం రేపుతోంది. ఇలా ప్రతీ నెలా వసూలు చేయడం తమ వల్ల కావడం లేదని.. ఇలా చేయాలంటే స్టేషన్ వచ్చిన బాధితులను పీడించాల్సి వస్తుందని, ఇసుక అక్రమ రవాణా కూడా మేమే చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
గూడూరు డివిజన్ ప్రాంతంలో పోలీస్ స్టేషన్లో పనిచేసే ఎస్ఐలు ప్రతినెలా రూ. కోటి వరకు వసూలు చేసి ఇవ్వాలని సదరు ఎస్ఐ పేర్కొన్నారు. ఈ అవినీతి సొమ్ము అధికార పార్టీ నేతలతోపాటు జిల్లా స్థాయి అధికారుల వరకు పంపకాలు ఉంటాయని ఆయన వెల్లడించారు.
సూళ్లురుపేటలో పనిచేస్తున్న ఎస్ఐ ఈ మేరకు లేఖ రాయడంతో జిల్లా కలెక్టర్ ఈ విషయాన్ని.. ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన వెంటనే సదరు ఎస్ఐపై బదిలీ వేశారు. అంతేగాక, ఆయనకు ఎక్కడా పోస్టింగ్ కూడా ఇవ్వకుండా వేకెన్సీ రిజర్వు(వీఆర్)లో ఉంచారు. కాగా, ఎస్ఐ ఆరోపణలపై చర్యలు తీసుకోకుండా.. ఆయనపైనే బదిలీ వేటు వేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.