ఎపి యువత కోసం నైపుణ్య రథం...ఈ నెల 22న సిఎం చే ప్రారంభం
అమరావతి: నిరుద్యోగ యువతకు చేయూత నిచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమం ప్రారంభించనుంది. ఉద్యోగ అవకాశాల గురించి ఎప్పటికప్పుడు సమచారాన్ని ఉద్యోగార్థులకు అందచేసేందుకు ఎపి గవర్నమెంట్ నైపుణ్య రథాన్ని అందుబాటులోకి తెస్తోంది. ఈ నెల 22 న సిఎం చంద్రబాబు అమరావతిలో ఈ నైపుణ్య రథాన్ని ప్రారంభించనున్నట్లు తెలిసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ), స్మార్ట్ ఏపీ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నైపుణ్యరథాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఏపీఎస్ఎస్డీసీ ఎండీ, సీఈవో కె.సాంబశివరావు మంగళవారం తెలిపారు. వివిధ కంపెనీలు, పరిశ్రమల్లో ఉండే ఉద్యోగాల సమాచారాన్ని సేకరించి నిరుద్యోగ యువతకు అందించడమే దీని లక్ష్యమని ఆయన చెప్పారు
అలాగే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు, విద్యార్థుల కోసం ఇప్పటికే ఎన్నో రకాల నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, వీటితోపాటు ఉద్యోగాల కల్పన కూడా కృషి చేస్తున్నామని సాంబశివరావు వెల్లడించారు. ఇప్పటికే ఒక నైపుణ్యరథం గుంటూరు, విజయవాడ పరిసరప్రాంతాల్లో నిరుద్యోగులు, ఉపాధి కల్పించే కంపెనీల మధ్య అనుసంధానంగా పని చేస్తోందని తెలిపారు. మరో నైపుణ్య రథాన్నిఈనెల 22న అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభిస్తారని వెల్లడించారు.
ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నవారు దీని కోసమే ప్రత్యేకంగా సిద్దం చేసిన "ఆప్లీ" యాప్ను డౌన్లోడ్ చేసుకుని వారి అర్హతకు సంబంధించిన వివరాలన్నింటినీ నమోదు చేసుకోవాలని చెప్పారు. ఆ తర్వాత వారి అర్హతలను అనుపరించి వారు నమోదు చేసుకున్న ఈ-మెయిల్కు ఎప్పటికప్పుడు ఉద్యోగాల సమాచారం పంపుతామని సాంబశివరావు తెలిపారు. మరిన్ని వివరాల కోసం టోల్ఫ్రీ నెంబరు 1800 425 2422లో తమను సంప్రదించాలని ఆయన సూచించారు. ఆప్లీ యాప్ ద్వారా ఇప్పటి వరకు దాదాపు 1700 కంపెనీలతో నైపుణ్యరథం అనుసంధానం అయి ఉందని ఏపీఎస్ఎస్డీసీ ఎండీ, సీఈవో కె.సాంబశివరావు ఈ సందర్భంగా చెప్పారు.