తల్లిని అత్యంత దారుణంగా రోడ్ మీదకు ఈడ్చి.. పీకపై కాలేసి తొక్కి.. తల నరికి వీరంగం వేసిన కొడుకు
కొడుకు కాదు అతను కసాయి.. నవమాసాలు మోసి, కని పెంచి పెద్ద చేసిన కన్నతల్లినే అత్యంత కిరాతకంగా కడతేర్చిన కసాయి.. పీకపై కాలేసి తొక్కి, రోడ్డుపైకి ఈడ్చుకొచ్చి, తల్లి తల తెగనరికిన కసాయి.. ఎంతో ప్రేమతో బంగారయ్య అని పేరు పెట్టుకున్న ఆ తల్లి ప్రేమకు అర్థం లేకుండా చేసిన కసాయి.. కొడుకు తప్పులన్నిటినీ కడుపులో దాచుకున్నా , ఆ తల్లి ప్రాణం తీసి నడిరోడ్డు మీద వీరంగం వేసిన కసాయి..
కొడుకు అన్న పదానికే అర్ధం లేకుండా చేసిన కసాయి..
మనవాళ్ళ పేరుతో వీలునామా రాయటంతో తల్లి తలనరికి చంపిన తనయుడు పశ్చిమ గోదావరి జిల్లా చిన కాపవరం లోని సత్యవతికి ముగ్గురు కుమారులు ముగ్గురు కుమార్తెలు. ఇద్దరు కుమారులకు వివాహాలు కాగా అంతా ఒకే చోట నివాసముంటున్నారు. ఏడు పదుల వయసున్న సత్యవతి ఆమె పేరిట ఉన్న 80 సెంట్ల భూమిని ఆమె తదనంతరం మనవళ్లకు చెందేలా వీలునామా రాసింది. అదే ఆమె పాలిట శాపమైంది. తల్లి తీసుకున్న నిర్ణయాన్ని సహించలేని రెండో కొడుకు బంగారయ్య అత్యంత కిరాతకంగా ఆ తల్లిని హతమార్చారు. భూమిని తమ పేరు పై కాకుండా, మనవళ్ళ పేరుతో వీలునామా రాయడం తో సహించలేకపోయిన బంగారయ్య అత్యంత కిరాతకంగా పొలం పనులకు ఉపయోగించే పారతో తల్లి తల నరికి, తలను చిద్రం చేశాడు.
నడి రోడ్డు మీద దారుణం .. భయాందోళనలో స్థానికులు
మొదటి పీక మీద కాలేసి తొక్కిన బంగారయ్య, తల్లిని ఈడ్చుకుంటూ రోడ్డుమీదకి లాక్కొచ్చి, అందరూ చూస్తుండగా ఆమె తల మొండెం వేరు పడేలా తెగనరికాడు. అక్కడితో అతని కోపం ఆగక తల్లి తలను చిద్రం చేశాడు. ఆ తర్వాత బట్టలు విప్పి నడిరోడ్డు మీద వీరంగం వేసాడు బంగారయ్య. నడిరోడ్డు మీద బంగారయ్య చేసిన దారుణం చూసినవారు భయాందోళనకు గురయ్యారు. ఎవరికి వారు ఇళ్లలోనికి వెళ్లి తలుపు గడియ పెట్టుకుని ఉండి పోయారు. అయితే అత్యంత కిరాతకంగా తల్లిని హతమార్చడంతో సత్యవతి కుమార్తె నాగమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బంగారయ్య ను అరెస్ట్ చేశారు.
తల్లిని చంపింది దేనికి .. ఆస్థి కోసమా ? మతి స్థిమితం లేకనా ?
అసలు ఇంతకీ తల్లిని బంగారయ్య హతమార్చింది మన వాళ్ళ పేరుమీద వీలునామా రాసిందని ఆక్రోశంతో నా? లేక మతిస్థిమితం లేకనా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే తల్లిని చంపిన బంగారయ్య కు మతిస్థిమితం లేదని స్థానికులు చెబుతున్నారు. పది రోజుల క్రితం తల్లిని అత్యంత దారుణంగా కొట్టాడని, చుట్టుపక్కల వారు పోలీసులకు ఫిర్యాదు చేస్తే తల్లి కొడుకు ను కాపాడుకుందని, అలాంటిదేమీ లేదని చెప్పి పోలీసులను వెళ్లగొట్టింది అని స్థానికులు చెబుతున్నారు. ఎంతైనా తల్లి ప్రేమ కదా.. కానీ బంగారయ్య మాత్రం కంటికి రెప్పలా కాపాడిన ఆ తల్లిని కడతేర్చి, అత్యంత కిరాతకంగా చంపి అమానుషంగా ప్రవర్తించాడు. అమ్మను చేజేతులారా చంపుకున్నవాడయ్యాడు.