అమ్మను మోసుకుంటూ పింఛన్ కోసం ఓ కుమారుడి పోరాటం .. ఏపీ అధికారులూ స్పందించండి
పేగు బంధానికి, రక్త సంబంధానికి అర్థం మరిచిపోతున్న రోజులివి.. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు పట్టెడు అన్నం పెట్టకుండా, వృద్ధాశ్రమాలకు పంపిస్తున్న రోజులివి. . అంతేనా ఆస్తి కోసం, డబ్బు కోసం తల్లిదండ్రులనే కడతేరుస్తున్న కసాయి బిడ్డలున్న రోజులివి.. ఇక ఇలాంటి రోజుల్లో పింఛను కోసం అమ్మను మోసుకుంటూ పోరాటం చేస్తున్న ఒక తనయుడు తల్లి పట్ల తనకున్న ప్రేమను తేటతెల్లం చేస్తున్నాడు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం లెప్రసీ కాలనీకి చెందిన వెంకన్న కూలి పనులు చేసుకుంటూ పొట్ట పోసుకుంటున్నాడు.
ఇక ఆయనకు 72 ఏళ్ల వయసున్న తల్లి ఉంది. తల్లి రమణమ్మ వృద్ధురాలు అయినప్పటికీ ఇప్పటివరకు ప్రభుత్వం అందించే వృద్ధాప్య పింఛను అందలేదు. ఇక తల్లి వృద్ధాప్య పింఛన్ కోసం ఐదు సంవత్సరాలుగా కాళ్లు అరిగేలా భీమవరంలోని అధికారుల చుట్టూ తిరిగాడు వెంకన్న. తల్లి వృద్ధాప్య పింఛన్ కోసం పోరాటం చేస్తున్న వెంకన్న ఎన్ని సార్లు అధికారుల చుట్టూ తిరిగినా లాభం లేకపోవటంతో ఏలూరులో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి వచ్చాడు.
ఏలూరులో బస్టాండ్ నుండి తల్లిని మోసుకుంటూ దాదాపు 5 కిలోమీటర్ల మేర నడిచి కలెక్టరేట్ కు వెళ్లాడు వెంకన్న. అక్కడ జేసీకి తమ గోడు చెప్పుకున్నాడు. ఇక వెంకన్నను చూసిన వారు తల్లి కోసం ఆ తనయుడు పడుతున్న కష్టాన్ని చూసి చలించిపోయారు. కనీసం కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా తల్లిని మోసుకుని వెళ్ళిన అతడిని చూసి అయ్యో పాపం అన్న వారు కొందరైతే , వెంకన్న నిరుపేద కావచ్చు కానీ తల్లిని ప్రేమించే గొప్ప గుణం , తల్లి పైప్రేమ అనే ఆస్థి ఉన్నాయని అందరూ చెప్పుకుంటున్నారు.
జగన్ స్ట్రాటజీ ... చంద్రబాబు టీమ్ కు చెక్ .. ఇక ఈ అసెంబ్లీ సమావేశాల్లో బాబుకు బాసటగా ఎవరు ?
అన్నీ ఉన్నా అమ్మా నాన్న మీద కనీసం ప్రేమ లేని బిడ్డలకు వెంకన్న తల్లి ప్రేమ కనువిప్పు కావాలని కోరుకుందాం . అలాగే వృద్ధాప్యం , పేదరికం రెండూ ఉన్నా అందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని చెప్తున్న సర్కార్ ఇప్పటికైనా ఈ వృద్ధురాలైన రమణమ్మ పించన్ విషయంలో చొరవ చూపి ఆమెకు పించన్ ఇవ్వాలని ఆశిద్దాం .. మరి అధికారులు ఈ వృద్ధురాలి విషయంలో ఎంత కాలానికి స్పందిస్తారో వేచి చూడాలి.