ఎపిలో వ్యవసాయశాఖ కోసమే.. ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్ వ్యవస్థ
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయ శాఖ కోసమే ప్రత్యేకించి ఒక సొంత వీడియో కాన్ఫరెన్స్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. నెల్లూరు జేడీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఈ సిస్టమ్ ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలోని అన్ని జిల్లాల వ్యవసాయ శాఖాధికారులతో నెల్లూరు నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. వ్యవసాయ శాఖ నుంచి రైతులకు సరైన సమయంలో సరైన సలహాలు,సూచనలు అందచేసేందుకు ఈ వ్యవస్థ ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. రైతులకు అవసరమైన సేవలు అందించే విషయమై అధికారులతో ఎప్పటికప్పుడు చర్చించేందుకు ఈ వ్యవస్థ దోహదం చేస్తుందని మంత్రి సోమిరెడ్డి చెప్పారు.
సాంప్రదాయ పద్దతులతో సరిపెట్టుకోవడం కాకుండా అత్యాధునిక టెక్నాలజీని వినియోగించి రైతులకు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు కృషి చేయాలని మంత్రి సూచించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్నందున విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖ వైపు నుంచి రైతులకు అవసరమైన అన్ని సదుపాయాలు,వసతులు కల్పిస్తున్నామని...అధికారులు వీటిని సక్రమంగా రైతులకు అందేలాగా వారికి మెరుగైన సేవలు అందించాలని మంత్రి సూచించారు.
ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టాలు సంభవిస్తున్నందున నష్ట వివరాల సేకరణ, పరిహారం చెల్లింపు విషయంలో అధికారులు సత్వరమే స్పందించాల్సి ఉంటుందన్నారు. రైతులకు సేవ చేసే విషయంలో అధికారులు ఏమాత్రం రాజీపడకుండా ముందుకు సాగాలని వ్యవసాయ శాఖ సిబ్బందికి మంత్రి పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత లోటు బడ్జెట్ తో ఉన్నప్పటికీ వ్యవసాయ శాఖకు రూ.19 వేల కోట్లకు పైగా కేటాయింపులు జరిపామని, అధికారులు ఈ కేటాయించిన నిధులను సద్వినియోగం చేస్తూ రైతులకు ప్రయోజనం కలిగించేందుకే వినియోగించాలన్నారు.
వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అమలయ్యే ప్రతి పథకం రైతుల చెంతకు చేరాలని, అలా చేర్చాల్సిన బాధ్యత అధికారులదేనని మంత్రి స్పష్టం చేశారు. పంటలకు కనీస మద్దతు ధర విషయంలో కేంద్ర ప్రభుత్వం మాటలకు, చేతలకు పొంతన లేదని మంత్రి సోమిరెడ్డి మండిపడ్డారు. జొన్న, మొక్కజొన్న పంటను కొనుగోలు చేయాలని కేంద్రప్రభుత్వాన్ని కోరేందుకు త్వరలోనే ఢిల్లీకి వెళ్లనున్నట్లు మంత్రి వెల్లడించారు.