వింత శిశువు మృతదేహం లభ్యం: ఏలియన్ అని ప్రచారంతో జనం బారులు
నెల్లూరు: నగరంలోని సండే మార్కెట్ సమీపంలోని సాయిబాబా ఆలయం వద్ద అతి చిన్నగా ఉన్న వింత శిశువు మృతదేహం లభ్యమైంది. కేవలం రెండు అంగుళాల పొడవుతో, మనిషిని పోలిన వింత ఆకారంతో ఉండటంతో దాన్ని ఏలియన్ అంటూ ప్రచారం జరిగింది.
దీంతో ఆ శిశువును చూసేందుకు జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. రెండు అంగుళాల పొడవు, వింత ఆకారం చూసేందుకు మనిషిని పోలిన విధంగా ఉండటంపై ప్రజలు విస్తుపోయారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
యువకుడి అనుమానాస్పద మృతి
నెల్లూరు జిల్లాలోని నాయుడుపేట మండలం బిరదవాడ గ్రామ సమీపంలో 5వ నెంబరు జాతీయ రహదారి పక్కన ఓ యువకుడు మృతి చెందినట్లు బుధవారం పోలీసులకు సమాచారం అందింది. ఎస్ఐ ఆంజనేయరెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుడు ప్రకాశం జిల్లా పొనగలూరు మండలం చొచ్చిరెడ్డి గ్రామానికి చెందిన నూకలపాటి బాలకృష్ణ (24)గా గుర్తించారు.
మృతుడి నడుంభాగం వద్ద నలిగిపోయినట్లుగా కనిపిస్తుంది. ఆ సమీపంలోనే రూళ్ల కర్ర ఉంది. బాలకృష్ణ సూళ్లూరుపేటలోని ఓ కాంట్రాక్టర్ వద్ద బేల్దారిగా పనిచేస్తున్నట్లు తెలిసింది. కాగా, బాలకృష్ణకు మూడు నెలల క్రితమే పార్వతి అనే మహిళతో వివాహమైంది. అనుమానాస్పద కేసు కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇది ఇలా ఉండగా ఆత్మకూరు మండలం రామస్వామిపల్లిలో ట్రాక్టర్ ప్రమాదంలో ఎంటెక్ విద్యార్థి మృతి చెందాడు. రామస్వామిపల్లికి చెందిన మాల కొండయ్య ఎంటెక్ చదువుతున్నాడు. బుధవారం పొలం పనులు చూసేందుకు ట్రాక్టర్ వేసుకువెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో రాత్రి ప్రమాదం చోటు చేసుకుంది. తిరగబడిన ట్రాక్టర్ కింద కొండయ్య పడటంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు.