నటి రజని కుమార్తెను కొట్టిన టీచర్పై కేసు, సస్పెండ్
హైదరాబాద్: నిన్నటి తరం సినీ నటి రజనీ కుమార్తెను చెంప దెబ్బ కొట్టిన ఉపాధ్యాయుడు సస్పెండయ్యారు. హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్ శివారులోని కండ్లకోయలో ఉన్న డిఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్లో రజనీ కుమార్తె రితక 7వ తరగతి చదువుతోంది.
తరగతి గదిలో అల్లరి చేస్తోందన్న కారణంతో రితికను గణిత ఉపాధ్యాయుడు గోపాలకృష్ణ చెంపదెబ్బ కొట్టారు. దీంతో బాలిక ఈ విషయాన్ని తన తల్లి రజనికి తెలిపింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రజని, పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
సెలబ్రిటీ కుమార్తె కావడం వల్లే తన బిడ్డపై చెయ్యిచేసుకున్నారని, గతంలో తన కుమారుడ్ని ఇలాగే కొట్టడంతో స్కూలు మార్పించానని ఆమె ఫిర్యాదులో తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు పాఠశాల ప్రిన్సిపాల్, టీచర్లను పోలీసులు పిలిపించి విచారించారు.
ఇరువర్గాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా గొడవ సద్దుమణగకపోవడంతో, గణిత ఉపాధ్యాయుడ్ని స్కూలు యాజమాన్యం సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
చిట్టీల రాణి ఆస్తుల జప్తునకు రంగం సిద్ధం
వందలాది మంది నటీనటులతో చిట్టీలు వేసి చివరికి టోపీ పెట్టిన విజయరాణి ఆస్తుల జప్తునకు రంగం సిద్ధమైంది. విజయవాడ, హైదరాబాద్లో ఉన్న ఆమె ఆస్తులను జప్తు చేసి వాటిని బాధతులకు పంచడానికి సిసిఎస్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. 4నెలల క్రితం సుమారుగా రూ. కోటికి నటీనటులు వేసిన చిట్టీలను విజయరాణి ఎగవేసిన సంగతి తెలిసిందే.
ఈ కేసులో విజయరాణి, ఆమె చెల్లెలు, కుమారుడు, కోడల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆమె బెయిల్పై విడుదలైంది. తమకు న్యాయం చేయాలని బాధితులు వాపోతున్న నేపథ్యంలో సిసిఎస్ అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. బాధితుల జాబితాను కూడా రూపొందించారు. ఆస్తుల జప్తునకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వుల కోసం అధికారులు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలిసింది.