తండ్రి పైశాచికం: రూ.5లక్షలు ఇచ్చి రూ. 15లక్షలు వసూలు! ఐనా ఆగని వేధింపులు, చివరకు..
కృష్ణా: కన్న కూతురు సుఖం కోసం తమ ఆస్తిపాస్తులన్నీ త్యాగం చేసిన తండ్రులను చూశాం. కానీ, డబ్బు కోసం కన్న కూతుర్నే వేధింపులకు గురిచేశాడు ఈ తండ్రి. రూ.5లక్షల అప్పు ఇచ్చి.. వడ్డీ పేరుతో ఏకంగా ఆమె వద్ద రూ.15లక్షలు వసలూ చేశాడు. అది కూడా చాలదంటూ మరో రూ.5లక్షల ఇమ్మంటూ వేధించాడు. దీంతో విధిలేని పరిస్థితిలో జిల్లా కలెక్టర్ను ఆశ్రయించింది ఆ కూతురు.
రూ.5లక్షల ఇచ్చి..
ఆ వివరాల్లోకి వెళితే.. గంపలగూడెం మండలం తునికిపాడు గ్రామానిక చెందిన కిలారు హనుమంతరావు(ఉపాధ్యాయుడు) కొన్ని సంవత్సరాల క్రితం తన కుమార్తె చంద్రలేఖకు రూ.5లక్షలు ఇచ్చాడు. రెండు సంవత్సరాల తర్వాత వడ్డీతో కలిపి రూ.8లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అతను చెప్పినట్లుగానే ఆమె ఆ మొత్తాన్ని ఇచ్చే సమయంలో వడ్డీతో కలిపి మొత్తం రూ. 15లక్షలు ఇవ్వాలంటూ పట్టుపట్టాడు.
రూ.15లక్షలు చెల్లించినా..
చేసేది లేక తండ్రి అడిగిన మొత్తాన్ని(రూ.15లక్షలు) చెల్లించింది చంద్రలేఖ. అయినా తండ్రి ధన దాహం తీరలేదు. మరో రూ.5లక్షలు ఇవ్వాలంటూ కన్న కూతురును వేధించసాగాడు. అప్పటికే ఎక్కువ మొత్తం చెల్లించిన చంద్రలేఖ.. ఇంకా ఇచ్చేది లేదని చెప్పింది. దీంతో ఆమెకున్న నాలుగున్నర ఎకరాల పొలంలో పంటసాగు చేయకుండా అడ్డుకున్నాడు ఆ దుర్మార్గపు తండ్రి.
వేధింపులు భరించలేక..
ఈ నేపథ్యంలో తన తండ్రి వేధింపులు భరించలేక కృష్ణా జిల్లా కలెక్టర్కు లిఖిత పూర్వక ఫిర్యాదు చేసింది చంద్రలేఖ. దీనిపై స్పందించిన కలెక్టర్.. దర్యాప్తు చేసి హనుమంతరావుపై చర్యలు తీసుకోవాలని అధకారులను ఆదేశించారు.
కానుకగా ఇచ్చానని చెప్పి..
కొన్నేళ్ల క్రితం తాము బెంగళూరులో స్థలం కొనుక్కుంటున్నామని చెబితే తన తండ్రి హనుమంతరావు రూ.5లక్షల ఇచ్చారని, మొదట అది కానుకగా ఇచ్చామని చెప్పి.. ఆ తర్వాత రూ.15లక్షలు వసూలు చేశాడని చంద్రలేఖ వాపోయింది. మరో 5లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ వేధింపులకు దిగడంతోనే కలెక్టర్ను ఆశ్రయించినట్లు చంద్రలేఖ తెలిపారు.