ఈ టెక్కీ రూటే సపరేటు: చిన్నారులకు ఎర, చోరీలు
నగరంలోని గోల్కాకలో నివాసం ఉంటున్న సుభాష్ సాఫ్ట్వేర్ ఇంజినీర్. జల్సాలకు, వ్యసనాలకు అలవాటుపడ్డ అతడు, శంకర్నగర్లోని ఓ వీడియో గేమ్ సెంటర్లోకి వచ్చే చిన్నారులను మచ్చిక చేసుకునేందుకు హోటళ్లకు తీసుకెళ్లి వారికి ఇష్టమైనవి తినిపించేవాడు. ఇలా స్నేహం చేస్తున్నట్లు నటించి, చిన్నారులతో దొంగతనాలు చేయిస్తుండేవాడు.
రైల్వే స్టేషన్లకు వెళ్లి బోగీల్లో ఛార్జింగ్ కోసం ఉంచిన ల్యాప్టాప్లు, సెల్ఫోన్లు, పర్సులను చిన్నారులతో చోరీలు చేయించేవాడు. కాచిగూడ, నాంపల్లి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల నుంచి బయల్దేరే పలు రైళ్లతోపాటు ఎంఎంటిఎస్ రైళ్లలో కూడా చోరీలు చేయిస్తుండేవాడు. గత కొంతకాలంగా ఇలా చోరీలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్నాడు.
అయితే నాలుగురోజుల క్రితం అంబర్పేటకు చెందిన బాలుడిని ఇతను చోరీలు చేయించడానికి తీసుకెళ్లగా.. తమ కుమారుడు కనిపించడం లేదని బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేశారు. వారి దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. నిందితుడు సుభాస్ తోపాటు వీడియో గేమ్స్ నిర్వాహకుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధిత బాలుడ్ని తన తల్లిదండ్రుల వద్ద చేర్చారు.