గుండెపోటు?: జమ్మూలో తెలుగు ఆర్మీ ఉద్యోగి మృతి
జమ్మూ/చిత్తూరు: చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన ఓ ఆర్మీ ఉద్యోగి జమ్మూలో విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఈ విషయాన్ని అక్కడి క్యాంపు అధికారులు శనివారం రాత్రి ఫోన్ ద్వారా బాధిత కుటుంబీకులకు తెలియజేశారు. మదనపల్లె మండలం కొండామర్రిపల్లె పంచాయతీ జెఎన్ఆర్ కాలనీకి చెందిన వాకా రామ్మోహన్ కుమారుడు వి.భానుప్రకాష్(34) 1998లో రాంచీలో జవాన్గా ఉద్యోగంలో చేరాడు.
అక్కడి నుంచి బదిలీ అయిన భానుప్రకాష్ ఇండియా-పాకిస్తాన్ సరిహద్దులో, కాశ్మీ ర్, వివిధచోట్ల విధులు నిర్వహిస్తూ ప్రస్తుతం జమ్మూలో హవల్దార్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఐదేళ్ల క్రితం కర్ణాటక రాష్ట్రం శ్రీనివాసపురానికి చెందిన సంధ్యతో ఈయనకు వివాహమైంది. వీరికి మూడేళ్ల కుమారుడు సాయిపార్థీవ్ ఉన్నాడు. కాగా భానుప్రకాష్ శనివారం మధ్యాహ్నం గుండెపోటుతో మృతి చెందాడని అక్కడి క్యాంపు అధికారులు రాత్రి బాధిత కుటుంబీకులకు ఫోన్ ద్వారా తెలియజేశారు.
భానుప్రకాష్ కుటుంబీకులు వెంటనే ఈ విషయమై జమ్మూలో పని చేస్తున్న మృతుడి స్నేహితులకు, క్యాంపు సిబ్బందికి ఫోన్చేసి అడుగగా భానుప్రకాష్ మృతి నిజమేనని విధులు నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడటంతో తలకు బలమైన గాయాలయ్యాయని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడని అతడి మిత్రుల ద్వారా తెలిసింది. దీంతో భానుప్రకాష్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భానుప్రకాష్ది గుండెపోటు మరణమా.. లేక ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడా అనేది తేలాల్సి ఉంది.
భానుప్రకాష్ మృతి చెందిన విషయం తెలుసుకున్న అతని భార్య సంధ్య, తల్లిదండ్రులు రామ్మోహన్, నిర్మలమ్మ, బంధువులు ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయారు. భానుప్రకాష్ ఆరునెలల క్రితమే స్వగ్రామానికి వచ్చి తిరిగి జమ్మూకు వెళ్లాడు. కాగా భానుప్రకాష్ మూడు నెలల్లో రిటైర్ కావాల్సి ఉండగా.. ఈ ఘోరం జరగడంతో ఆయన కుటుంబీకులు తీవ్రంగా కన్నీరుమున్నీరయ్యారు. సోమవారం ఉదయం భానుప్రకాష్ మృతదేహం మదనపల్లెకు రానుందని కుటుంబసభ్యులు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం పుంగనూరులో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు.