ఏంటమ్మా! అప్పుడలా..ఇప్పుడిలానా??: కర్ణాటకలో పురంధేశ్వరికి షాకిచ్చిన తెలుగు రైతు
బెంగళూరు/అమరావతి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో అన్ని పార్టీ నేతలు ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పలువురు నేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్లారు.
తెలుగువారే టార్గెట్
తెలుగు ప్రజలు అధికంగా ఉండే నియోజకవర్గాల్లోనే తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలు ఎక్కువగా దృష్టి సారించారు. అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేసిందంటూ పలువురు తెలుగు వారు భారతీయ జనతా పార్టీపై కొంత వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.
రైతు ప్రశ్నకు షాకైన పురంధేశ్వరి
ఈ నేపథ్యంలోనే రాయచూరు జిల్లాలో ప్రచారం నిర్వహిస్తున్న ఏపీ బీజేపీ నేత పురంధేశ్వరి కూడా అక్కడి తెలుగువారి నుంచి కొంత వ్యతిరేకత ఎదుర్కొవాల్సి వచ్చింది. ‘అమ్మా.. పోయిన ఎన్నికల్లో కూడా నువ్వు ఇక్కడకు వచ్చి ప్రచారం చేశావ్.. అప్పుడు కాంగ్రెస్కు ఓటేయమన్నావ్. ఇప్పుడు వచ్చి.. బీజేపీకి ఓటేయమంటున్నావ్.. ఏపీకి అన్యాయం చేసిన పార్టీలతోనే ఎప్పుడూ ఎందుకుంటావమ్మా?' అని పురంధేశ్వరిని ఓ తెలుగు రైతు ప్రశ్నించారు.
మాదీ గుడివాడే..
దీంతో పురంధేశ్వరి ఆయన ప్రశ్నకు షాకయ్యారు. ఆమె సమాధానం చెప్పేలోపే మరోసారి ఆయన అందుకున్నారు. ‘మీ స్థానంలో వేరొకరు ఉంటే అడిగేవాన్ని కాదమ్మా.. మాది గుడివాడ తాలూకా. మీ నాన్నగారు టీడీపీ స్థాపించినప్పుడు పార్టీ జెండా మోశా. ఆ అభిమానంతోనే అడుగుతున్నా' అని వ్యాఖ్యానించారు.
పురంధేశ్వరి సమాధానం చెప్పి..
‘రాష్ట్రాలను బట్టే పరిస్థితులు మారతాయి. న్యాయం చేసే పార్టీలకే ఓటు వేయమని చెబుతున్నా. నాది రాజకీయం కాదు' అని చెప్పిన పురంధేశ్వరి అక్కడ్నుంచి వెళ్లపోయారట. ఏపీకి హోదా, ప్యాకేజీ ప్రకటించకపోవడం, చివరి బడ్జెట్లోనూ కేటాయింపులు చేయకపోవడంపై ఇక్కడి తెలుగు వారు కూడా బీజేపీపై కొంత వ్యతిరేకత కలిగి ఉన్నారని స్థానిక తెలుగువారు చెబుతున్నారు.