సంక్రాంతి వస్తానని చెప్పి.. జమ్మూకాశ్మీర్లో తెలుగు జవాను మృతి, కుటుంబంలో తీరని విషాదం
శ్రీనగర్/చిత్తూరు: మరో తెలుగు జవాను జమ్మూకాశ్మీర్లో అమరుడయ్యారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని గడ్డకిందపల్లికి చెందిన రెడ్డప్పనాయుడు(38) గత 14 ఏళ్లుగా భారత సైన్యంలో జవానుగా విధులు నిర్వహిస్తున్నాడు. విధుల్లో బాగంగా సరిహద్దులో శనివారం పహారా కాస్తుండగా.. చలితీవ్రత ఎక్కువ కావడంతో అస్వస్థతకు గురై కుప్పకూలిపోయాడు.
వెంటనే సహచర జవాన్లు అతడ్ని ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే రెడ్డప్పనాయుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆ తర్వాత ఈ విషయాన్ని రెడ్డప్ప కుటుంబసభ్యులకు ఆర్మీ అధికారులు తెలియజేశారు. దీంతో రెడ్డపనాయుడు కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
సంక్రాంతి పండక్కి సెలవుపై వస్తాననన్న తన కుమారుడు.. విగత జీవిగా మారాడని తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. రెడ్డప్పకు భార్య, కొడుకు, కుమార్తె ఉన్నారు. కాగా, జమ్మూకాశ్మీర్లోని ఆర్మీ బేస్ క్యాంపు నుంచి శుక్రవారం మధ్యాహ్నం రెడ్డప్పనాయుడు తన భార్య, పిల్లలతో ఫోన్లో చాలా సేపు సరదాగా మాట్లాడారు. అంతలోనే ఈ విషాద వార్త చెవినపడటంతో ఆయన కుటుంబం తల్లడిల్లిపోతోంది.
సంక్రాంతి పండకు వస్తానని మాటిచ్చి మమ్మల్ని విడిచిపోయావా? అంటూ రెడ్డప్ప తల్లి శాంతమ్మ కన్నీరుమున్నీరయ్యారు. గడ్డకిందపల్లిలో ఎంతో ఇష్టంతో ఇల్లు కట్టించారని, దాన్ని కళ్లతో చూడకుండానే కన్నుమూశారంటూ విలపించారు. తనకు, తన పిల్లలు సాత్విక్, నిషితలకు ఆ భగవంతుడు అన్యాయం చేశారంటూ ఆయన భార్య రెడ్డమ్మ కన్నీరుపెట్టుకున్నారు.
తల కొరివి పెడతాడనుకున్న పెద్ద కొడుకు మృతిని జీర్ణించుకోలేకపోతున్నట్లు తండ్రి రెడ్డప్ప ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. జవాను భౌతిక కాయాన్ని ఆదివారం స్వగ్రామం తీసుకువచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.