దొంగకు ఊరందరూ దొంగలే ... బుద్దాను వదలని కేశినేని నానీ
Recommended Video
విజయవాడ ఎంపీ కేశినేని నాని మీద పీవీపీ పరువునష్టం దావా వేసినా సరే నానీ మాత్రం అటు వైసీపీ తోనూ, ఇటు టీడీపీ నేతలతోనూ ఫైట్ కొనసాగిస్తానని తేల్చి చెప్తున్నారు . మొన్నటికి మొన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నమీద తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడ్డారు కేశినేని నానీ . దానికి బుద్దా కౌంటర్ ఇచ్చారు. ఆ తర్వాత బుద్దా వ్యాఖ్యలకు నానీ రోజుకో కౌంటర్ ఇస్తున్నారు. నిన్నటికి నిన్న బాలయోగి ఆస్తులు కాజేశానని అందుకు గర్వపడుతున్నా అని పేర్కొన్న నానీ తాజాగా దొంగకు ఊరందరూ దొంగలే అంటూ మరోమారు బుద్దాపై విరుచుకుపడ్డారు.
కేశినేని ట్రావెల్స్ పై బుద్దా వెంకన్న ఆరోపణలు .. కేశినేని సమాధానం
కేశినేని నానీ తనపై చేసిన వ్యాఖ్యలకు బుద్ధా వెంకన్న ఘాటుగా స్పందించారు. ‘నువ్వు చేసినవన్నీ అభాండాలు, నేను చెప్పేవన్నీ నిజాలు. బస్సుల మీద ఫైనాన్స్ తీసుకొని 1997లో సొంతంగా దొంగ రిసిప్ట్ లు తయారుచేసుకుని ఫైనాన్స్ వారికి డబ్బులు చెల్లించకుండా నువ్వే దొంగ ముద్ర వేసుకొని కోట్లాది రూపాయలకు ఫైనాన్స్ కంపెనీలను చీట్ చేసిన నువ్వా ట్వీట్ చేసేది.' అని ట్వీట్ చేశారు. ఇక ఆ ట్వీట్ కు నానీ ఇప్పుడు సమాధానం చెప్పారు . ఒక పక్క చంద్రబాబు ఆగమన్నా నానీ మాత్రం బాబు ఆజ్ఞలను బేఖాతరు చేస్తున్నారు.
అలా చేసి ఉంటె 88 ఏళ్ల కేశినేని ట్రావెల్స్ మూతపడేది కాదని మండిపడిన నానీ
ఇక బుద్దా కేశినేని ట్రావెల్స్ పై చేసిన వ్యాఖ్యలకు నానీ ఈ రోజు ఘాటుగా సమాధానం ఇచ్చారు.తాను బస్ నంబర్ ప్లేట్లు మార్చి వ్యాపారం చేసుండినా, ఫైనాన్స్ చేసిన వారికి డబ్బులు ఎగ్గొట్టి వుండినా, ఈరోజు కేశినేని ట్రావెల్స్ మూతపడే పరిస్థితి వచ్చేది కాదని విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఈ ఉదయం ఆయన ఓ ట్వీట్ చేశారు . ''ప్రబుద్ధుడు చెప్పింది అక్షర సత్యం. నంబర్ ప్లేట్లు మార్చి వ్యాపారం చేసినా, ఫైనాన్షియర్లకి డబ్బులు ఎగ్గొట్టి వ్యాపారం చేసినా, 88 ఏళ్ల కేశినేని ట్రావెల్స్ మూసుకునే పరిస్థితి , ఆస్తులు అమ్ముకునే దుస్థితి వచ్చేది కాదు. దొంగకి ఊరందరూ దొంగలులానే కనపడతారు" అని అన్నారు తన ట్వీట్ ద్వారా ఘాటుగా సమాధానం ఇచ్చారు కేశినేని నానీ.
మళ్ళీ మళ్ళీ బుద్దాను టార్గెట్ చేస్తున్న నానీ .. బాబు మాట బేఖాతరు
ఇక చంద్రబాబు ఆదేశాలతో వెంకన్న ఈ వివాదానికి పుల్స్టాప్ పెట్టి ఎలాంటి పోస్ట్ లు పెట్టకుండా ఆగారు. కానీ ఎంపీ కేశినేని నానీ మాత్రం రాయేసి రంగమాడుతున్నారు. గిల్లికజ్జాలు పెట్టుకుంటున్నారు. ఎంపీ కేశినేని నానీ ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. వెంకన్నను మళ్లీ మళ్ళీ టార్గెట్ చేస్తున్నారు. చంద్రబాబు జోక్యం చేసుకుని నిలువరించకుంటే ఇది మరింత దారుణంగా మారే ప్రమాదం వుంది. ఒక పక్క బీజేపీ వైపు కేశినేని చూస్తున్నారని వార్తలు వస్తున్నా, బీజేపీ నేతలను కేశినేని కలుస్తున్నా, అలాగే బీజేపీ ఇటీవల కాలంలో కేశినేనికి పార్లమెంట్ అంచనాల కమిటీ సభ్యుడిగా కూడా అవకాశం ఇచ్చింది. ఇక ఇలాంటి తరుణంలో నానీ తీరు టీడీపీ అధినేత చంద్రబాబుకు తలనొప్పిగా మారింది.