అరకు లోయలో పడిన టూరిస్ట్ బస్సు: నలుగురు మృతి, 25 మందికి గాయాలు, అంతా హైదరాబాద్ వాసులే
విశాఖపట్నం: జిల్లాలోని అనంతగిరి మండలం డముకులో శుక్రవారం పర్యాటకులతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. అరకు డముకు ఘాట్ రోడ్డులోని ఐదో నెంబర్ మలుపు వద్ద బోల్తా పడిన బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మందికిపైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
కాగా, ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఓ చిన్నారితోపాటు నలుగురు ప్రయాణికులు మరణించినట్లు తెలిసింది. మృతులంతా హైదరాబాద్ వాసులేనని గుర్తింపు. సమాచారం అందుకున్న పోలీసులు, 108 సిబ్బంది సంఘటా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు.
లోయలోపడిన బస్సును గుర్తించిన సహాయక చర్యలు చేపడుతున్నారు. రాత్రి కావడంతో సహాయక చర్యలకు కొంత ఇబ్బందిగా మారింది. కాగా, ప్రమాదంలో గాయపడిన 25 మందిని అనంతగిరి, కేజీహెచ్ ఆస్పత్రులకు తరలించారు. గాయపడినవారిలో చిన్న పిల్లలు కూడా ఉన్నారు.
బస్సు లోయలోకి పడిపోవడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బాధితులంతా శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి అరకు వచ్చి, తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కాగా, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రాథమికంగా బస్సు బ్రేక్ ఫెయిల్ కావడం వల్లే ప్రమాదం జరిగినట్లు నిర్ధారించారు.
ప్రమాద వివరాల కోసం అధికారులు కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. వివరాల కోసం 08912590102, 08912590100 నెంబర్లను సంప్రదించాలని అధికారులు తెలిపారు.
ఘటనపై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ప్రమాదంపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఘటనపై విచారం వ్యక్తం చేశారు. 'అరకు ఘాట్లో పర్యాటకుల బస్సు ప్రమాదానికి గురవ్వడం పట్ల తీవ్ర ఆవేదన చెందుతున్నా. ప్రమాదంలో పలువురు హైదరాబాద్ వాసులు మృతి చెందడం బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. సహాయకచర్యలు వేగవంతం చెయ్యాలని ఏపి ప్రభుత్వాన్ని కోరుతున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా’ అని ట్విట్టర్ వేదికగా హరీశ్ రావు స్పందించారు.