వాలంటీర్ అత్యుత్సాహం.. చనిపోయిన వృద్ధురాలికి పింఛను అందజేత
విజయనగరం: ప్రభుత్వ పథకాలను ప్రజల ఇళ్ల వద్దకు చేరవేసేందుకు వాలంటీర్ల వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెలకొల్పిన విషయం తెలిసిందే. కాగా, ఓ వాలంటీర్ అత్యుత్సాహం ఇప్పుడు విమర్శలకు తావిచ్చింది. చనిపోయిన వృద్ధురాలికి పింఛను అందజేయడం ఇప్పుడు వివాదాస్పదమైంది.
ఈ ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుర్ల గ్రామంలో ఇజ్జిరోతు త్రినాథ్ అనే వ్యక్తి వాలంటీర్గా పనిచేస్తున్నాడు. గ్రామంలో ఎర్ర నారాయణమ్మ అనే మహిళ చనిపోయింది. అయితే, చనిపోయిన ఆ మహిళ వేలిముద్ర తీసుకుని ఆమె కుటుంబసభ్యులకు పింఛను అందజేశాడు వాలంటీర్.
చనిపోయిన వ్యక్తికి పింఛను అందజేయడంపై ప్రతిపక్షాల నేతలు, గ్రామస్తులు అభ్యంతరం తెలిపారు. అధికారుల వద్ద మెప్పుకోసమే వాలంటీర్లు ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఈ ఘటనపై జిల్లా డీఆర్డీఏ పీడీ సుబ్బారావు స్పందించారు.
ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత వారి వేలిముద్రలు పనిచేయవని సుబ్బారావు తెలిపారు. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. గుర్ల ఎంపీడీవోను విచారణ అధికారిగా నియమించారు. కాగా, ఆ పింఛను చనిపోయిన మహిళ అంత్యక్రియలకైనా పనికొస్తుందని మరికొందరు చెబుతుండటం గమనార్హం.
కాగా, పంచాయతీ ఎన్నికల్లోనూ వాలంటీర్ల వ్యవహారం కొంత వివాదాస్పదమైన విషయం తెలిసిందే. పలు చోట్ల టీడీపీ మద్దతుదారుల విజయం కోసం పనిచేశారనంటూ పలువురు వాలంటీర్లను ప్రభుత్వం తొలగించిన విషయం తెలిసిందే. ఇక ప్రతిపక్షాలు కూడా అధికార పార్టీపై విమర్శలు చేశాయి. వాలంటీర్లను వైసీపీ మద్దతుదారుల గెలుపు కోసం వాడుకుందని, ప్రతిపక్షాలు గెలిచిన చోట్ల వాలంటీర్లను తొలగించారంటూ మండిపడ్డాయి. ఈ నేపథ్యంలోనే మున్సిపల్ ఎన్నికల్లో వాలంటీర్లు ఎన్నికల విధులను నిర్వహించకూడాదని, స్లిప్పులు కూడా పంపిణీ చేయకూడదని ఎస్ఈసీ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.